Medical Education: ఇండియాలో మెడికల్ కోర్సులు(Medical courses) చదవాలనుకునే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్- నీట్(NEET) కోసం రిజిస్టర్ చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అయితే మెడికల్ కాలేజీలు(Medical colleges), సీట్ల సంఖ్య మాత్రం ఆ మేరకు పెరగట్లేదు. మరోవైపు ఎంబీబీఎస్, బీడీస్ కోర్సుల ఫీజులు మాత్రం భారీగా పెరుగుతూ పోతోంది. దీంతో చాలామంది ఇతర దేశాల్లో, తక్కువ ఖర్చుతో మెడికల్ కోర్సులు పూర్తిచేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఎడ్యుకేషన్పై చేసే ఖర్చు పెరిగిందని 2010లోనే గుర్తించింది లాన్సెట్ కమిషన్. గతంతో పోలిస్తే భారత్లో ఈ వ్యయం రెట్టింపు కాగా, చైనాలో వైద్య విద్య ఫీజులు మూడు రెట్లు పెరిగాయని ఒక ప్రముఖ దినపత్రిక నివేదించింది.
ప్రభుత్వ సీట్లు తక్కువే
భారతదేశంలో మెడికల్ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో నీట్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్లు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో MBBS సీట్లు పొందుతున్నారు. వీరికి సగటు కోర్సు ఫీజు సంవత్సరానికి రూ. 8,000 నుంచి రూ. 35,000 వరకు ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు దొరకని అభ్యర్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చేరాల్సి వస్తోంది. అయితే ఈ కాలేజీల్లో కోర్సు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలోని ఏదైనా ప్రైవేట్ కాలేజీలో వైద్య విద్యకు ఫీజు రూ.60 లక్షల నుంచి 70 లక్షలు ఉంటుంది. అయితే రష్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో అది రూ.30 లక్షల నుంచి 35 లక్షలు మాత్రమే.
పెరుగుతున్న పోటీ
ఇండియాలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కోసం ప్రతి సంవత్సరం దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకుంటారు. వీరిలో దాదాపు 9 లక్షల మంది అర్హత సాధిస్తుండగా.. 90,000 MBBS సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అడ్మిషన్ రాని విద్యార్థులు కొందరు, మెడికల్ కోర్సుల ఫీజు తక్కువగా ఉండే విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఫీజులు, భారతదేశంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నదానిలో సగం వరకు మాత్రమే ఉండటం గమనార్హం.
Street View: ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ సేవలు బంద్.. కారణం ఏంటంటే..
స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్
అయితే పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను సాకారం చేసేందుకు కొన్ని రాష్ట్రాలు, సంస్థలు స్పెషల్ స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. HDFC బ్యాంక్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్, నేషన్వైడ్ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్, వాహని స్కాలర్షిప్, మెడికల్ స్టూడెంట్స్ కోసం అందించే డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్ మొదలైన స్కీమ్స్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. రూ. 2.5 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న మైనారిటీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివేకానంద మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తుంది.
నీట్పై వ్యతిరేకత
మన దేశంలో అత్యంత కఠినంగా ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నీట్ ఒకటి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కష్టతరంగా ఉంటేనే, మెరుగైన స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అనేది ప్రాథమిక సూత్రం. అందుకే పోటీ తీవ్రంగా ఉండే మెడికల్ అడ్మిషన్స్ కోసం నీట్లో ఆ కాఠిన్యతను కొనసాగిస్తున్నారు. అయితే ఇది పేద విద్యార్థులపై ప్రభావం చూపిస్తుందని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్రంలోని మెడికల్ అడ్మిషన్లపై నీట్ ప్రభావం గురించి అధ్యయనం చేయడానికి జస్టిస్ ఎకె రాజన్ కమిటీని ఏర్పాటు చేసింది.
12వ తరగతిలో ప్రతిభ చూపిన వారికంటే, తక్కువ మార్కులు వచ్చినవారు నీట్ ద్వారా అడ్మిషన్స్ పొందినట్లు కమిటీ గుర్తించింది. తక్కువ మెరిట్ ఉండి, సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నవారికే నీట్ ప్రయోజనకరంగా మారిందని రిపోర్ట్ వెల్లడించింది. నీట్ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగిస్తే, తమిళనాడు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. అయితే నీట్ ఎగ్జామ్ మాత్రం పూర్తి మెరిట్ బేస్డ్ ఎంట్రన్స్ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MBBS, Medical study