వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు సంబంధించిన నీట్- పీజీ(NEET-PG) కౌన్సెలింగ్లో.. ఓబీసీ(OBC), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా అమలుకు సుప్రీంకోర్టు(Supreme Court) పచ్చ జెండా ఊపింది. ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో రూ.8 లక్షల రూపాయల క్రిమిలేయర్కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో గతేడాది మాదిరిగానే 2022–23 ప్రవేశాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయనుంది. దీని ప్రకారమే కౌన్సెలింగ్ జరగనుంది. విద్యార్థుల అడ్మిషన్ (Admission) ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రమాణాలపై తుది నిర్ణయం మాత్రం వచ్చే నెలలో వెల్లడిస్తామని, అప్పటివరకు గతేడాది నిబంధనల ప్రకారమే కౌన్సెలింగ్(Counseling) నిర్వహించాలని కోరింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Jobs in Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుబాటు సంబంధించిన సమస్య సుప్రీం కోర్డు పరిశీలనలో ఉన్నందున, నీట్ పీజీ 2022–23 ప్రవేశాలకు రూ. 8 లక్షల ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కొంత మంది వైద్య విద్యార్థులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా, వచ్చే ఏడాది కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లను వర్తింపజేయాలని, కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయకూడదని బెంచ్ తెలిపింది. దీనికి సంబంధించి మార్చిలో మరింత స్పష్టతనిస్తామని పేర్కొంది. అయితే, ఈడబ్ల్యూఎస్ నిబంధనలకు సంబంధించి ఆన్లైన్ ఫారమ్లో ఎడిట్ ఆప్షన్ గడువును పొడిగించాలని తన క్లయింట్లు కోరుతున్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ కోటాపై మార్చిలో తుది తీర్పు..
దీనికి న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సమాధానమిస్తూ “లేదు, మేము మీకు ఎడిట్ విండో పొడిగింపును మంజూరు చేయలేం. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం. అలా చేస్తే ఆర్టికల్ 32 నిబంధనను ఉల్లంఘించినట్లే అవుతుంది. అందువల్ల అధికారులు ఎలా ఏర్పాట్లు చేసి ఉంటే, అలాగే చేయండి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతుంది. తుది తీర్పు మార్చిలో వెల్లడిస్తాం. అప్పటివరకు కౌన్సిలింగ్ ప్రక్రియను ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుగుణంగానే కొనసాగించాలి.’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్(EWS Reservation) పొందడానికి రూ. 8 లక్షల ఆదాయ పరిమితి ఇవ్వవచ్చని, తద్వారా ఈ అకడమిక్ సెషన్లో ప్రవేశానికి ఎటువంటి సమస్య లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఈ ఆదాయ పరిమితిపై విచారణ కొనసాగిస్తామని తెలిపింది. మార్చి 2022లో ఈ ఆదాయ పరిమితి సరైనదేనా? కాదా? అని కోర్టు చివరకు నిర్ణయిస్తుంది. అప్పటివరకు, నీట్ పీజీ 2023లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈ పిటిషన్ను వరుణ్ దిలీప్భాయ్ భట్ అనే వైద్య విద్యార్థితో పాటు మరికొందరు విద్యార్థులు దాఖలు చేశారు. విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ వాదనలు వినిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.