మంచి కళాశాలలో ఇంజనీరింగ్ (Engineering) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఫీజులు భారం కానున్నాయి. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజుల మోత మోగనుంది. వచ్చే మూడేళ్ల కు గాను భారీ స్థాయి లో ఫీజులు పెరిగే అవకాశముంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రవేశాలు - ఫీజు నియంత్రణ కమిటీ (TSFRC) ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షిస్తారు. కళాశాలల ఆదాయ, వ్యయాలు, మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చు బట్టి ఫీజులను నిర్ణయిస్తారు. 2019లో నిర్ణయించిన ఫీజు గడువు ఈ ఏడాది ముగియనుంది. దీంతో వచ్చే మూడేళ్లకు (2022-23 నుంచి ) కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TSRFC) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ కొన్ని రోజులుగా కాలేజీలతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. ఇందులో టాప్టెన్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పెంపుపై భారీగా డిమాండ్ చేస్తున్నాయి. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. డిసెంబర్ నుంచి మొదలయ్యే 2022–23 విద్యా సంవత్సరంలో ఫీజుల పెంపుపై నెలలుగా కసరత్తు చేస్తోంది కమిటీ .
టాప్ కాలేజీలో రెండు లక్షలకు చేరువగా ఫీజు..?
అయితే ప్రైవేటు కాలేజీలు పట్టు వదలడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రతిపాదించిన ట్యూషన్ ఫీజులనే అమలు చేయాలని పలు కోరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 150కి పైగా ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిలో దాదాపు 20 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.35 వేలు, వందకు పైగా కాలేజీల్లో రూ.80 వేల వరకూ, మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల వరకూ ఉంది. ఏఐసీటీఈ ఈ ఏడాది ఫీజులను కనీసం రూ.79,000 నుంచి గరిష్టంగా 1,89,000 వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అయితే, దీనిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఎఫ్ఆర్సీ (Fee regulating Committee)లు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. దీంతో ఇపుడు బంతి తెలంగాణ కమిటీలో పడినట్లైంది. అయితే కాలేజీలు కోరినట్టు ఫీజులు పెంచితే ఏటా రూ. 21 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇదే క్రమంలో రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వచ్చే విద్యార్థులపైనా అదనపు భారం పడుతుంది. ఈ కారణంగానే తర్జన భర్జనపడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ.
10 వేలకు పైగా ర్యాంకు వస్తే మాత్రం..
అయితే ప్రైవేటు కాలేజీల వాదనపై కొంత ఇబ్బంది పడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ . ప్రతీ ఏటా 10–15 శాతం ఫీజులు పెంచుతున్నారని. ఇప్పుడు ఏకంగా 25 శాతం అంటే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటుండటం విద్యార్థులకు ఊరటనిచ్చేది. ఇదే విషయాన్ని కాలేజీల యాజమాన్యాలకు నచ్చజెప్పే యత్నం చేస్తోంది. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మాత్రం ససేమీరా అంటున్నాయి. అయితే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఎంసెట్లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికీ పూర్తి రీయింబర్స్మెంట్ ఉంటుంది. 10 వేలకు పైగా ర్యాంకు వస్తే మాత్రం ఈ ఫీజులు విద్యార్థులకు భారలే మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Colleges, Engineering course, Telangana