ఇప్పటికే యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకటి, రెండు నోటిఫికేషన్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రానున్నది ఎన్నికల సంవత్సరం కావడంతో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షలు రాయాలనుకునేవారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టే కన్నా, ముందు నుంచి చదువుతుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రోజు లేదా వారం వారీగా చదవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. గత వారంలో ముఖ్యమైన అంశాలేమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
* బడ్జెట్ 2023
గత వారం జరిగిన వాటిలో ముఖ్యమైనది బడ్జెట్ 2023. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24కు సంబంధించి రూ.45,03,097 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ‘సప్త రుషి’ పేరుతో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అవి 1.సమ్మిళత అభివృద్ధి 2. ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి 3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు 4. సామర్థ్యాల వెలికితీత 5. హరిత వృద్ధి 6. యువశక్తికి ప్రోత్సాహం 7. ఆర్థిక రంగం బలోపేతం.
ఈ ఆదర్శాలతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను ‘అమృత కాల’ బడ్జెట్గా పేర్కొన్నారు. రూ.ఏడు లక్షల వరకు ఆదాయ పన్నుకు మినహాయింపు ఇచ్చారు. ద్రవ్య లోటును 5.9 శాతానికి తగ్గించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. విద్యా రంగానికి గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.1,12,898.97 కోట్లు కేటాయించారు. 30 అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
* కేరళ బడ్జెట్ 2023
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 3న కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ కేరళ రాష్ర్ట బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పేదరిక నిర్మూలనకు రూ.80 కోట్లు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.100 కోట్లు, పెరుగుతున్న ధరల కోసం రూ.2,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
* ఐసీసీ ర్యాకింగ్స్ లో ఆరోస్థానంలో శుభ్మాన్ గిల్
భారత స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో దుమ్ము రేపి ICC పురుషుల వన్డే ర్యాంకింగ్స్లో 20 స్థానాలు ఎగబాకి ఆరోస్థానానికి చేరుకున్నాడు. ఇదే అతడి కెరియర్లో అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. 360 పరుగులతో సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ స్కోర్తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
ఇది కూడా చదవండి : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ జాబ్స్కి అప్లై చేశారో, లేదో చెక్ చేయండి..
* 1,792 కొవిడ్ కేసులు
దేశంలో ఇంకా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 4న కొత్తగా 128 కేసులు నమోదు కాగా దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 1,792కి పెరిగింది. మరణాల సంఖ్య 5,30,745కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Career and Courses, EDUCATION, General knowledge, JOBS, Shubman Gill