దేశంలోని వివిధ కాలేజీలు, వర్సిటీల్లో యూజీ కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షగా సీయూఈటీ(కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్)ను గతేడాది నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా దేశంలోని అనేక వర్సిటీలు, ప్రముఖ విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అయితే ఈ ఎగ్జామ్పై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షగా సీయూఈటీని స్వాగతిస్తున్నామని, అయితే దాన్ని ఇంకా తప్పనిసరి చేయలేదు కాబట్టి కొత్త వ్యవస్థను ఎంచుకోవడానికి సిద్ధంగా కాలేజీలు, యూనివర్సిటీలకు సీయూఈటీ అనేది స్వచ్ఛందంగా ఉండాలని ఏఐయూ స్పష్టం చేసింది.
AIU సెక్రటరీ జనరల్ పంకజ్ మిట్టల్ మాట్లాడుతూ.. సీయూఈటీ మంచి వ్యవస్థ అన్నారు. విద్యార్థుల సమస్యలను తగ్గించడానికి ఈ ప్రవేశ పరీక్షను తీసుకొచ్చారని పేర్కొన్నారు. చాలా కాలేజీలు ప్రస్తుతం CUET ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయని, అయితే ఇది యూనివర్సిటీలకు ఐచ్ఛికమని భారత ప్రభుత్వం ఇటీవల చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్స్ సీయూఈటీ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నా.. ఈశాన్య ప్రాంతాలు ఈ కొత్త వ్యవస్థను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పంకజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
* ఈ ఏడాది 206 ఇన్స్టిట్యూట్స్
సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా కాకుండా, సీయూఈటీ ద్వారానే కల్పిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది 90 ఇన్స్టిట్యూట్స్ సీయూఈటీలో పాల్గొనగా, ఈ ఏడాది ఈ సంఖ్య 206కు పెరిగింది. ఇందులో 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 33 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి.
* సీయూఈటీ -2023 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
సీయూఈటీ ఫస్ట్ ఎడిషన్ పరీక్షలు గతేడాది జులైలో నిర్వహించారు. అయితే టెక్నికల్ సమస్యల కారణంగా కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ను రద్దు చేశారు. తరువాత ఈ సెంటర్లలో మళ్లీ పరీక్షలను నిర్వహించారు. మరోపక్క సీయూఈటీ -2023 రిజిస్ట్రేషన్స్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో మార్చి 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం సీయూఈటీ పరీక్షలు మే 21 నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి.
‘ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్’ అనే అంశంపై మూడు రోజుల వైస్ ఛాన్స్లర్ల జాతీయ సదస్సు యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ మేఘాలయ(USTM)లో మార్చి 23న ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్లో విద్యావ్యవస్థలో మార్పుపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో సీయూఈటీపై కూడా చర్చించే అవకాశం ఉందని ఏఐయూ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2023, JOBS