దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ సర్వీస్కు (Civil Service Exam) సెలక్ట్ అవ్వాలంటే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాలి. యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్ను అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేర్కొంటారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు చాలా మంది విద్యార్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. అతి తక్కువ మందే మొదటి అటెంప్ట్లోనే విజయం సాధిస్తారు. దీంతో సివిల్స్ (Civils) అభ్యర్థులకు సమయం చాలా కీలకం. అయితే ప్రస్తుతం కొవిడ్ కారణంగా వృథా అయిన రెండేళ్ల సమయం తమకు తిరిగిరాదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వెసులుబాట్లు కల్పించాలని సివిల్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్ట్రా అటెంప్ట్ ఇవ్వాలి
2020, 2021వ సంవత్సరంలో ప్రపంచాన్ని కొవిడ్ కుదిపేసింది. కొవిడ్ కారణంగా ఎందరో జీవితాలు తలకిందులు అయ్యాయి. ప్రతి రంగం కొవిడ్ కారణంగా సంక్షోభానికి గురైంది. ఈ ప్రభావం UPSC అభ్యర్థులపైన కూడా పడింది. చాలామంది అభ్యర్థులు కరోనా బారిన పడి ఎగ్జామ్ రాయలేకపోయారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు కోచింగ్ సెంటర్లు ఓపెన్ కాలేదు. దీంతో సివిల్స్ అభ్యర్థుల ప్రిపరేషన్ గాడి తప్పింది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా తమకు చాలా సమయం వృథా అయిందని, UPSC ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఒక ఎక్స్ట్రా అటెంప్ట్ ఇవ్వాలని సివిల్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ కారణంగా నష్టపోయిన తమకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు.
19న సుప్రీంలో పిటిషన్దాఖలు
ఇప్పుడు UPSC అభ్యర్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఆందోళన చేపట్టాలని భావిస్తున్నారు. డిసెంబర్ 19న నిరసన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఫ్రెష్ పిటిషన్ ఫైల్ చేయనున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు పలు సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో తమ అభ్యర్థనను తెలియజేస్తున్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల రిక్రూట్మెంట్స్లో వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు UPSCలో కూడా ఏజ్ రిలాక్సేషన్ అందించాలని కోరుతున్నారు. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా మార్చి ప్రారంభంలో.. UPSC అభ్యర్థుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని వారికి ఒక ఎక్స్ట్రా అటెంప్ట్ అందించి, ఏజ్ రిలాక్సేషన్ అందించాలని అపెక్స్ కోర్టు సూచించింది.
అవసరమైన ఏర్పాట్లు చేయలేదు
2021 UPSC మెయిన్స్ ఎగ్జామ్ రాసే సమయంలో ఎగ్జామ్స్ సెంటర్ వద్ద కొవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ వేల సంఖ్యలో అభ్యర్థులు ఒకచోట చేరారు. దానివల్ల ఎగ్జామ్ రాసే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు రిస్కులో పడినట్లు అయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ సోకిన అభ్యర్థులను ఎగ్జామ్ రాయకుండా నిలువరించారని , వారు ఎగ్జామ్ రాయడానికి కనీసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా తమ రెండేళ్ల సమయం వృథా అయిందని ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకుని వెసులుబాట్లు కల్పించాలని, తమ ఇన్నేళ్ల కష్టం వృథాగా పోతుందని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Civil Services, JOBS, UPSC