Byju’s : అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తున్న ఆర్థిక మాంద్యం భూతం భారత్లో కూడా ప్రభావం చూపిస్తోంది. పదేళ్ల క్రితం ఎదురైన అనుభవాల నేపథ్యంలో చిన్న చిన్న స్టార్టప్ల నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల వరకు లేఆఫ్ ప్రకటించడమో, లేదా ఉద్యోగులను శాశ్వతంగా తొలగించడమో చేస్తున్నాయి. కంపెనీని నష్టాల బాట నుంచి తప్పించేందుకు కఠినమైనా ఈ చర్య తీసుకోక తప్పట్లేదని సదరు సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.
ఓ అనాలిసిస్ ప్రకారం 2022లో వెయ్యికి పైగా కంపెనీలు సుమారు 1.50 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు. 2023లో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ ఎడ్యూ టెక్ స్టార్టప్ సంస్థ అయిన బైజూస్ (Byju’s) వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. ఇంత మందిని ఒకేసారి తొలగించడం గత కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి. బైజూస్లో ఇంతమందిని తొలగించడంపై నిర్వాహకులు ఏం అంటున్నారు, ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు, సంస్థ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో తెలుసుకుందాం.
అలా మొదలైంది
2015లో బెంగుళూరు ప్రధాన కేంద్రంగా బైజూస్ ప్రారంభమైంది. 22 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే విలువైన ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కొవిడ్ సమయంలో స్కూల్స్ మూతపడటంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యం పెరిగింది. ఆ టైంలో బైజూస్ భారీగా నియామకాలు చేపట్టింది. గతేడాది స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా, అంతర్జాతీయంగా మార్కెట్లు పతనం కావడంతో ఆ ఆలోచన విరమించుకుంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టింది.
Delhi University: అనాథలకు అండగా ఢిల్లీ యూనివర్సిటీ.. ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు ప్రకటన
తప్పని కఠిన నిర్ణయాలు
కంపెనీని నష్టాల నుంచి తప్పించుకునేందుకు తప్పట్లేదంటూ కొన్ని నెలల క్రితం 2,500 మందిని తొలగించారు. ఆపరేషనల్ కాస్ట్ తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. ఆ తర్వాత ఎటువంటి తొలగింపులు ఉండవని ప్రకటించారు. కానీ కొన్ని నెలలకే కొంతమందికి లే-ఆఫ్లు ప్రకటించారు. ఇలా ఉండగా ఇప్పుడు మరో వెయ్యిమందిని తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈసారి డిజైన్, ప్రొడక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో తొలగింపులు చేపట్టగా ఒక్క ఇంజినీరింగ్ విభాగంలోనే 300 మందిని తొలగించారు. అందులో ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. తాజా నిర్ణయాలతో సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ విభాగాలతో పాటు ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు మనీ కంట్రోల్ నివేదిక బట్టి తెలుస్తోంది. ఆ సంస్థకు ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 5 శాతం.
రానున్న రోజుల్లో
ఇలా ఉండగా రానున్న తమ బ్రాండ్ మరింత పెంచుకునేలా రానున్న విద్యా సంవత్సరంలో 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు అయిన దివ్య గోకుల్ నాధ్ తెలిపారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధితో పాటు పెట్టుబడిదారులు, వాటాదారులకు ప్రాధాన్యం ఇవ్వడానికే కంపెనీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.