ఏపీలో గ్రూప్ 1 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. ఇంటర్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లో చూడొచ్చు. వాస్తవానికి ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ 2018లో ప్రారంభమైంది. కానీ వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 167 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 67 మంది మహిళలు, 96 మంది పురుషులు వివిధ పోస్టులకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
అయితే.. కేవలం 163 పోస్టులను మాత్రమే ప్రస్తుతం భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వివిధ కారణాలతో 4 పోస్టులను భర్తీ చేయలేదని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అయితే.. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో ఎంపికైన వారిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుశ్మిత ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో వైఎస్సార్సీపీ జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన శ్రీనివాసరాజు నిలిచి సత్తా చాటారు.
ఫలితాల విడుదల సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏపీలో గ్రూప్ 1 అభ్యర్థులు 2018 నుంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 2020వ సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించిన మెయిన్స్ ఎగ్జామ్ కు 9,679 మంది అభ్యర్థులు పాల్గొన్నారన్నారు. అయితే.. వాల్యుయేషన్ ను డిజిటల్ విధానంలో నిర్వహించి గతేడాది ఏప్రిల్ నెలలో ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు గౌతమ్ సవాంగ్. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా వాల్యుయేషన్ చేశామన్నారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటర్వ్యూల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏపీపీఎస్సీ అమలు చేసిందన్నారు గౌతమ్ సవాంగ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, APPSC, JOBS, State Government Jobs