ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 111 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా.. వీటికి జనవరి 08న పరీక్షను నిర్వహించారు. తాజాగా ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోండి. ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఏపీలో 111 గ్రూప్-1 (Group-1) పోస్టుల భర్తీకి జనవరి 08, 2023న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 83.38 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 % మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
జనవరి 10, 2023న ఉదయం 10 గంటలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించింది. తర్వాత 20 రోజులకు ఫలితాలను వెల్లడిస్తామని చెప్పిన ఏపీపీఎస్సీ నేడు ఆ ఫలితాలను విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉండగా.. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్కూడా నిర్వహించనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తాజాగా ఆ షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
దీనిలో తెలుగు పేపర్ ఏప్రిల్ 23 నిర్వహించనుండగా..
ఇంగ్లీష్ పేపర్ ఏప్రిల్ 24న నిర్వహించనున్నారు.
ఈ రెండు పేపర్లు క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. వీటిలో వచ్చిన మార్కులు మెయిన్స్ మార్కులతో కలపరు.
పేపర్ 1 : జనరల్ ఎస్సై పరీక్ష- ఏప్రిల్ 25
పేపర్ 2 : హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - ఏప్రిల్ 26
పేపర్ 3 : పాలిటీ, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ - ఏప్రిల్ 27
పేపర్ 4 : ఎకానమీ ఇండియా అండ్ ఏపీ - ఏప్రిల్ 28
పేపర్ 5 : సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణ సమస్యలు - ఏప్రిల్ 29.
అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని చైర్మన్ తెలిపారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.