ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇలాంటి నోటిఫికేషన్ల తుఫాను నిరుద్యోగులు చూసి ఉండరు. అంతలా ఎప్పడూ లేని విధంగా తెలంగాణలో(Telangana) భారీ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఒక్క డిసెంబర్ నెలలో దాదాపు 22 నోటిఫికేషన్లకు(Notifications) పైగా విడుదలయ్యాయి. ఒక వైపు ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు.. మరో వైపు అర్హత పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. డిసెంబర్ 22, 2022 న తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం డిసెంబరు 30 నుంచి ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా.. ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్లు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..?
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 29 సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన వారు ఈ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుల వివరాలిలా ఉన్నాయి. జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ , ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
పరీక్ష విధానం..
ఈ అర్హత పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఏ సబ్జెక్టు తీసుకున్నా కామన్ గా ఉంటుంది. ఇలా పేపర్ 1లో టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పేపర్ 2లో సంబంధిత సబ్జెక్టులో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మొత్తం 300 మార్కులకు 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
అయితే ఈ అర్హత పరీక్షతో పాటు.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు టీఎస్ సెట్ కు ప్రిపేర్ అయితే.. UGC Net కు కూడా ఉపయోగపడుతుంది.
వీటిలో అర్హత సాధించిన వారు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉద్యోగాలకు, అసిస్టెంబ్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో ఇప్పటికే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, అసిస్టెంబ్ ప్రొఫెసర్ల కొరకు డీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో జనవరి 31, 2023న అందుబాటులోకి రానుంది. అయితే.. ఈ నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేయాలని.. కొత్తగా పీజీ పూర్తయి.. సెట్ లేదా నెట్ రాసే వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
టీఎస్ సెట్ దరఖాస్తు విధానం ఇలా..
Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఓపెన్ అయిన కొత్త పేజీలో అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో అప్లై అనే ఆప్షన్ ను ఎంచుకొని.. ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వాలి.
Step 4 : దీనిలో వివరాలను నమోదు చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ వస్తుంది.
Step 5 : వాటి సహాయంతో లాగిన్ అయి.. విద్యార్హత వివరాలు, ఫీజు చెల్లింపు విధానం పూర్తి చేసి.. అప్లికేషన్ ను సబ్ మిట్ చేయవచ్చు.
Step 6 : చివరకు మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana, Telangana government jobs, Ts set