కరోనా ప్రభావంతో విద్యావ్యవస్థ చాలా ఇబ్బందులను ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. బడిబాటను మరచి ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అన్ని క్లాసుల విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ టీచర్లు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రమోషన్ సిస్టమ్ ఉండటంతో ఇబ్బందులేమీ రాలేదు కానీ, పదో తరగతి విషయంలోనే విద్యాశాఖ తీవ్ర ఒత్తిడికి లోనయింది. చివరకు గతేడాది పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోషన్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహణ విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పటికే కరోనా ప్రభావంతో క్లాసులు సరిగ్గా జరగనందున 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, సోషల్ పేపర్లను 100 మార్కులకు ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను చెరో 50 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా, పరీక్షల్లో మరో కీలక మార్పునకు సంబంధించిన వివరాలను ఏపీ విద్యాశాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.. హైదరాబాద్ లో కుమార్తె ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
ఇప్పటి వరకు సబ్జెక్టుకు వంద మార్కుల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి మరో 20 మార్కులను ఇంటర్నల్ పరీక్షల నుంచి తీసుకుని కలిపేవారు. ఇప్పుడు ఈ ఏడాదికి ఆ విధానాన్ని రద్దు చేశారు. పూర్తిగా 100 మార్కులకు పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షా విధానంలో మార్పుల గురించి ఏపీ విద్యాశాఖ గురువారం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఒక్కో మార్కువి 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రెండు మార్కుల అతి స్వల్ప ప్రశ్నలు 8, నాలుగు మార్కుల స్వల్ప సమాధాన ప్రశ్నలు 8, ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5 ఉండనున్నాయి. మొత్తం రెండున్నర గంటల సమయంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, Andhra Pradesh, Ssc exams, Telangana