కరోనా ప్రభావం తీవ్రంగా పడిన రంగాల్లో విద్యారంగం ఒకటి. కరోనా ప్రారంభంలో మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటి వరకు కూడా పూర్తిగా తెరుచుకోకపోవడం ఆందోళన కలిగించే అశంగా మారింది. ఆన్లైన్ లో క్లాసులు జరుగుతున్నా.. అవి విద్యార్థులకు ఎంతమేర అర్థం అవుతున్నాయన్నది అంతు చిక్కని ప్రశ్నగానే మారింది. ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని సీఎం జగన్ సర్కార్ సైతం సోమవారం నుంచి స్కూళ్లను తెరవడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. గ్రామం, వార్డు సచివాలయాలను యూనిట్ గా తీసుకుని, ప్రతీ వారం కేసులను నిర్ధారించుకోవాలని, 10 శాతం కరోనా కేసులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లు తెరవాలని స్పష్టం చేసింది. విద్యార్థులను 20 మంది చొప్పున ఓ బ్యాచ్ గా ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహించాలని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ, సరిపోను స్థలం ఉంటే అన్ని క్లాసులను ఒకేసారి నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. 6 , 7 తరగతులు ఒకరోజు 8,9,19 తరగతులు మరో రోజు నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన విద్యార్థులపై హెచ్ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గదర్శకాల్లో సూచించారు.
పాఠశాలల్లో ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది.
- విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి తప్పనిసరిగా నిత్యం థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని టెస్టులకు పంపించాలి.
-పిల్లలను స్వచ్ఛందంగా స్కూల్ కు పంపింస్తున్నట్లు పేరెంట్స్ నుంచి అనుతమతి లేఖలు తీసుకోవాల్సి ఉంటుంది.
-ప్రతీ వారం ఒక స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ర్యాండమ్ గా కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ పాఠశాలలోని అందరికీ పరీక్షలు నిర్వహించాలి.
-మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఎదురెదురు కూర్చోకుండా చూడాలి.
-స్కూల్ వదిలిన సమయంలో విద్యార్థులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి.
-స్కూల్ బస్సుల్లోనూ సగం మందినే అనుమతించాలి. ఆటోలు, రిక్షాల్లో విద్యార్థులు రావొద్దు. బస్సులు, వ్యాన్ల సదుపాయం లేకపోతే పేరెంట్స్ తీసుకొచ్చి, తీసుకెళ్లాలని మార్గదర్శకాలలో స్పష్టం చేశారు.
-వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలతో ఉండే పిల్లలను స్కూళ్లకు అనుమతించవద్దని సర్కార్ స్పష్టం చేసింది.
-దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు విద్యార్థులను స్కూల్ కు తీసుకురావడం, మళ్లీ తీసుకుకపోవడానికి కూడా అనుమతించకూడదు.
ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Schools reopening, Ys jagan