కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వరుసగా రెండో ఏడాది రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫలితాల ఎలా ఎవ్వాలనేదానిపైనే అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి రెండేళ్లకు సంబంధించిన ఫలితాలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గత విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు నిర్వహించని కారణంగా విద్యార్థులందరినీ ఆల్ పాస్ గా ప్రకటించి ఇంటర్మీడియట్ లో చేరే అవకాశం కల్పించారు. తాజాగా వారికి కూడా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-20లో విద్యార్థులు రాసి సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. గత ఏడాదిటెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వకపోవడంతో వారికి ఇబ్బందులెదురవుతున్నాయి. భవిష్యత్తులో పదోతరగతి మార్కుల ఆధారంగా ఇచ్చే ఉద్యోగాల దరఖాస్తు చేసినప్పుడు కూడా గ్రేడ్లు, మార్కులు లేకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితి రావొచ్చు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయ రతన్ నేతృత్వంలోని హై పవర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంది.
2019-20లో టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్-1, ఫార్మేటివ్-2, ఫార్మేటివ్-3, సమ్మేటివ్-1 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఫార్మేటివ్ పరీక్షకు 20 మార్కుల చొప్పున 60, సమ్మేటివ్ పరీక్షకు 40 మార్కుల చొప్పున లెక్కగట్టి గ్రేడ్లు కేటాయించనున్నారు. వీటిలో ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల యావరేజ్ ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. గ్రేడ్ల కేటాయింపు అనంతరం విద్యార్థులకు మరోసారి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
2020-21కి ఇలా..
కరోనా సెకండ్ వేవ్ వల్ల వరుసగా 2020-21 విద్యాసంవత్సరం సగం రద్దైంది. పరీక్షలను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు మార్కుల లెక్కింపు.. గ్రేడ్ల కేటాయింపు చేయాల్సి వచ్చింది. ఇందులో కూడా ఫార్మేటివ్ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఫార్మేటివ్-1, ఫార్మేటివ్-2 పరీక్షలు మాత్రమే జరిగాయి. దీంతో ఒక్కో పరీక్షకు 50 మార్కుల చొప్పున లెక్కగట్టి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. ఇక్కడ కూడా ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల సగటును పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. దీనిపై హైపవర్ కమిటీ తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించిన తర్వాత తుదినిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నెలాఖరులోగా ఫలితాలు ప్రకటించి విద్యార్థులను తదుపరి విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకేసారి రెండేళ్లకు సంబంధించిన ఫలితాలను ప్రకటించడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP ssc results