భారత ఎడ్యుకేషన్లో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ లెవల్లో మల్టిపుల్ ఎంట్రీ- ఎగ్జిట్స్, క్రెడిట్ పాయింట్స్, డ్యుయల్ డిగ్రీ వంటి సంస్కరణలను అమలు చేయనున్నారు. తాజాగా భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి జాయింట్ అండ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్లను అందించే ప్రతిపాదనలకు విదేశీ యూనివర్సిటీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వెల్లడించింది. ఇండియన్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోవడానికి 49 విదేశీ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. ఈ యూనివర్సిటీలతో భాగస్వామ్యం కోసం అవగాహన ఒప్పందాలను రూపొందిస్తున్నామన్నారు. పలు యూనివర్సిటీలు ఇప్పటికే అవగాహన ఒప్పందాలను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని పేర్కొన్నారు.
భారతదేశానికి చెందిన 230 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, విదేశాలకు చెందిన 1256 ఉన్నత విద్యాసంస్థలు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా లండన్ యూనివర్సిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్యారిస్ యూనివర్సిటీ, హైడెల్బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ యూనివర్సిటీ, బర్మింగ్హామ్ యూనివర్సిటీ, క్వీన్ మేరీ వంటి యూనివర్సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి.
2016 ఎడ్యుకేషన్ నిబంధనల్లో మార్పులు..
భారత్, అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల మధ్య ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్స్కు భారత ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది మేలో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 2016 ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం.. ఒక భారతీయ యూనివర్సిటీ, ఒక విదేశీ యూనివర్సిటీ కేవలం ‘ట్విన్నింగ్’ అండ్ ‘జాయింట్ డిగ్రీ’ ప్రోగ్రామ్లను అందించడానికి మాత్రమే కొలాబరేట్ కావాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో భారతీయ విద్యార్థులు విదేశీ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేషన్తో పాటు భారతీయ సంస్థ నుంచి డిగ్రీని మాత్రమే అందుకుంటారు. అయితే ఈ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు.
ప్రస్తుతం డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ను కూడా విదేశీ యూనివర్సిటీలు ఆఫర్ చేయవచ్చు. దీంతో భారత్తోపాటు విదేశీ యూనివర్సిటీలు సైతం డిగ్రీలను అందించనున్నాయి. ఒక విద్యార్థి విదేశీ యూనివర్సిటీ నుంచి ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం కోర్సు క్రెడిట్స్ 30 శాతం వరకు పొందవచ్చు. అయితే, జాయిట్ లేదా డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కింద, వారు మొత్తం క్రెడిట్స్ లో 30 శాతానికి పైగా పొందవచ్చు. గవర్నమెంట్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఇంటర్నేషనల్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో ఇప్పటికే 48 భారతీయ యూనివర్సిటీలు భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, University Grants Commission