తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహపరుస్తూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు, వయోపరిమితికి సంబంధించి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెనుకబడిన కులాలు(బీసీలు), దివ్యాంగులకు కేసీఆర్ సర్కారు శుభవర్తా అందించింది. ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10 ఏళ్లు సడలింపును ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి శనివారం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది...
తెలంగాణలో బీసీలు, దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కాలపరిమితి, వయోపరిమితి గడువు పెంపునకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర సబార్డినేట్ నిబంధలను సవరిస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రయోజనాలు మే 31, 2031 వరకు అమలు అయ్యేలా ఆదేశాల్లో అంశాలున్నాయి. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పేరుతో గెజిట్ వెలువడింది.
2030, మే 31 వరకు బీసీలకు, దివ్యాంగులకు రిజర్వేషన్ల గడువు, వయోపరిమితి సడలింపుల పొడిగింపు అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ గతేడాది మే 28న, అలాంటి ఉత్తర్వులనే దివ్యాంగుల శాఖ నవంబర్ 11న జారీ చేశాయి. వాటి అమలుకు విధిగా రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలను మార్చాలని ఆయా శాఖలు కోరడంతో.. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ప్రభుత్వం కొత్త గెజిట్ జారీ చేసింది.
కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. చాలా మంది బీసీలకు మేలు చేకూరనుంది. ఇదిలా ఉంటే, సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున, ఇవాళ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. సోమవారం ఉభయ సభల్లో రెండింటిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.