ఇటీవలే ముగిసిన ఐపిఎల్–2020 సీజన్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. అన్ని సీజన్ల లాగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సీజన్ కూడా క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఐపీఎల్ సీజన్ జరుగుతున్న రోజుల్లో సోషల్ మీడియా వేదికలపై నెటిజన్ల మధ్య వివిధ అంశాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. మ్యాచ్ స్కోర్లు, ప్లేయర్లు, టీం గెలుపోటములు ఇలా అనేక అంశాలపై నెటిజన్లు పోస్టులు పెడుతుంటారు. దీనిలో భాగంగానే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా ఈ సీజన్లో నెటిజన్లు ఎక్కువగా చర్చించిన అంశాల గురించి పంచుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫేస్ బుక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఐపీఎల్ సీజన్లో నెటిజన్లు ఎక్కువగా చర్చించిన మోస్ట్ పాపులర్ టీంగా ట్రోఫీ విజేత ‘ముంబై ఇండియన్స్’ జట్టు నిలిచింది.
దీని తర్వాతి స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నిలిచాయి. నెటిజన్లు ఎక్కువగా చర్చించిన మోస్ట్ పాపులర్ ప్లేయర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి 10 మిలియన్ల ప్రస్తావనలు నమోదు చేసినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పేర్కొంది. కాగా, ఐపీఎల్ మ్యాచ్ల గురించి ఎక్కువగా చర్చించే వారిలో 74 శాతం మంది 18–34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులేనని ఫేస్ బుక్ తెలిపింది.
మోస్ట్ పాపులర్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ..
ఐపీఎల్–2020 సీజన్లో ఎక్కువ మంది చర్చించిన మోస్ట్ పాపులర్ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా, ఐపీఎల్ గురించి సోషల్ మీడియా వేదికలపై ఎక్కువగా చర్చించిన నెటిజన్లలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు ముందు వరుసలో ఉన్నారు.
దీనిపై ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ మనీష్ చోప్రా మాట్లాడుతూ.. "క్రికెట్ అన్ని సరిహద్దులను దాటి, భారతదేశాన్ని ఒకేచోట చేర్చింది. గత కొన్ని సంవత్సరాలుగా వేడుకగా జరుగుతున్న ఐపీఎల్ క్రీడ, క్రికెట్ అభిమానులకు అతిపెద్ద సాంస్కృతిక వేదికగా నిలుస్తోంది." అని అన్నారు. టోర్నమెంట్లో భాగంగా ఒక్కో మ్యాచ్ ముగిసే కొద్ది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లలో ప్లేయర్స్, టీమ్స్ పై చర్చించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబర్చారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2020, Mumbai Indians, Virat kohli