news18-telugu
Updated: September 23, 2020, 11:47 AM IST
ఎంఎస్ ధోనీ, గౌతం గంభీర్
మంగళవారం జరిగిన రాజస్థాన్, చెన్నై మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీ, ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. ఆట కూడా ఏం బాలేదని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా చేరిపోయారు. అంత భారీ టార్గెట్ ఉన్నప్పుడే కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో ఎలా వస్తారని.. బ్యాటింగ్లో కాస్త ముందు రావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. తన కంటే ముంద రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, శామ్ కరన్ను పంపించడమేంటని ప్రశ్నించారు. జట్టులో రైనా లేనప్పుడు ఆ స్థానంలో ధోనీనే వెళ్లాల్సి ఉండేదని అన్నారు. మొదట్లో నెమ్మదిగా ఆడి.. చివర్లో మూడు సిక్స్లు కొట్టినంత మాత్రాన ఎలా ఉపయోగం లేదని విమర్శించారు గంభీర్.
'ధోనీ ఏడో స్థానంతో బ్యాటింగ్కు రావడం చూసి నేను ఆశ్చర్యపోయా. తన కంటే ముందు గైక్వాడ్, కరన్ను పంపించడం వెర్రిపనిగా అనిపించింది. జట్టులో రైనా లేనప్పుడు.. నీకంటే కరన్ బెస్ట్ అని అనుకుంటున్నావా. నీ కంటే రుతురాజ్ గైక్వాడ్, కరన్, కేదార్ జాదవ్, డుప్లెసిస్, మురళి విజయ్ ఉత్తమమని భావిస్తున్నావా. 217 పరుగుల టార్గెట్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందు రావాల్సి ఉంది. చివరి ఓవర్లో మూడు సిక్స్లు కొట్టినంత మాత్రాన ఉపయోగం లేదు. అవి వ్యక్తిగత పరుగులు మాత్రమే. జట్టుకు ఉపయోపడేవి కావు. అదే వేరొక కెప్టెన్ ఇలా చేసి ఉంటేనే తీవ్ర విమర్శలుఎదుర్కొనే వారు. కానీ ఎంఎస్ ధోనీ కాబట్టి ఎవరూ నోరు మెదపడం లేదు.' అని ESPN Cricinfoతో మాట్లాడుతూ అన్నారు గంభీర్.
మంగళవారం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. సంజు శామ్సన్ 74, స్టీవెన్ స్మిత్ 69 పరుగులతో అదరగొట్టారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డుప్లెసిస్ మినహా (72) ఎవరూ పెద్దగా ఆడలేదు. అతడు ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా సభ్యుల నుంచి సహకారం లేకపోవడంతో చెన్నై ఓడిపోయింది. 14వ ఓవర్లో స్కోర్ 114/5 వద్ద ఉన్నప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చినప్పటికీ దూకుడుగా ఆడలేదు. ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ బాదినప్పటికీ అప్పటికే ఓటమి ఖరారయింది. చివరకు 16 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు గెలిచింది.
Published by:
Shiva Kumar Addula
First published:
September 23, 2020, 10:20 AM IST