Taliban Leaders: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఆప్ఘన్ లో ఏ జరుగుతోంది. తాలిబన్ల ప్రధాన నేతలు అఖుండ్జాదా, బరాదర్ ఎక్కడున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తారు అనుకుంటే.. అసలు వారి పేర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు..? ప్రస్తుతం ఆప్ఘన్ లో ఉన్న ప్రభుత్వం పాకిస్థాన్ చెప్పుచేతల్లో ఉందా..?
Taliban internal fight in Afghanistan: ఆప్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు (Talibans) అంతర్గత కుమ్ములాటల్లో కీలక నేత హతమయ్యారా..? ప్రస్తుతం ఇదే అంశం దుమారం రేపుతోంది. అఫ్గానిస్తాన్ (Afghanistan) నుంచిఅమెరికా (America) సేనలు వైదొలగడం, తాలిబన్లు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దేశం స్వాధీనం కాగానే తాలిబన్లు (Taliban) తమ అగ్రనేతలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అఫ్గాన్లో పాగా వేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు తాలిబన్లు చాలా సమయం తీసుకున్నారు. చివరకు మల్లగుల్లాల తరువాత ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఇందులో తాలిబన్లకు కాకుండా హక్కానీ నెట్వర్క్ నేతలకు పెద్దపీట వేశారు. దీంతో అఫ్గాన్ అంతర్గత పరిణామాలపై ప్రపంచ దేశాలు మరింత శ్రద్ధ పెట్టాయి. సదరు తాత్కాలిక ప్రభుత్వాన్ని అనేక దేశాలు గుర్తించడంలేదు. ఒకపక్క ఇంత హడావుడి జరుగుతున్నా, తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్జాదా మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నారు. కానిపక్షంలో యూఎస్తో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు (Abdul Ghani Baradar)
ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెద్దగా గుర్తింపులేని ముల్లా హసన్ను ప్రధానిగా ప్రకటించారు. దీంతో అసలు తాలిబన్ నేతలకు ఏమైందన్న ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ద స్పెక్టేటర్ అనే పాశ్చాత్య మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్ను బందీ చేసి ఉంటారని, అఖుండ్జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది.
కాబూల్ గొడవే కారణమా?
ఆఫ్గనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భవనంలో హక్కానీలకు, తాలిబన్లకు మధ్య పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్ను బందీగా ఉంచినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి.
సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించడం, పంజ్షీర్పై శాంతియుత పరిష్కారాన్ని కోరడం వంటి బరాదర్ చర్యలు నచ్చని హక్కానీ నెట్వర్క్ ఆయనపై దాడి చేసి తరువాత బంధించిందని కథనాలు వచ్చాయి. అదేవిధంగా తాలిబన్ అగ్రనేత అఖుండ్జాదాను హతమార్చిఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ ఈపాటికి బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కానీ నెట్వర్క్ వీరిని మాయం చేసిందని చాలామంది భావిస్తున్నట్లు స్పెక్టేటర్ కథనం పేర్కొంది.
గతంలో ముల్లా ఒమర్ 2013లో మరణిస్తే 2015వరకు బయటకు చెప్పని వైనాన్ని గుర్తు చేసింది. ఇదంతా పాక్ పరోక్షంగా ఆడిస్తున్న నాటకంగా విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపింది. తాలిబన్ల కన్నా తమకు అనుకూల హక్కానీ నెట్వర్క్ నేతల చేతిలో అఫ్గాన్ ప్రభుత్వం ఉండడం పాక్కు కావాలని, అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు ముందు ఐఎస్ఐ చీఫ్ అఫ్గాన్కు వచ్చారని గుర్తు చేసింది.
పాక్ కుయుక్తులు అర్థం చేసుకోకుండా తాలిబన్లు గుడ్డిగా నమ్మారని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా చాలాసార్లు విమర్శించారు. తాజా కథనాలు చూస్తే అదే నిజమైందని, పాక్ చేతికి అఫ్గాన్ పాలనా పగ్గాలు పరోక్షంగా వచ్చాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.