యూఏఈ: భారత్ నుంచి యూఏఈకి వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులకు మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పేలా లేదు. యూఏఈ తాజాగా చేసిన ప్రకటనే ఇందుకు కారణం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దక్షిణ ఆసియా దేశాల నుంచి రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఆగస్ట్ 1 వరకూ పొడిగిస్తున్నట్లు యూఏఈ తాజాగా ప్రకటించింది. దీంతో.. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలకు చెందిన ప్రయాణికులు.. ఎలాంటి వీసా కలిగి ఉన్నవారైనా గల్ఫ్ దేశానికి ఆగస్ట్ 1 వరకూ వెళ్లే పరిస్థితి లేదు. నైజీరియా, దక్షిణాఫ్రికాపై విధించిన నిషేధాన్ని కూడా ఆగస్ట్ 1 వరకూ యూఏఈ పొడిగించింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఏప్రిల్ 24న ఇండియా, దుబాయ్ మధ్య రాకపోకలను నిలిపివేస్తూ యూఏఈ ప్రకటన చేసింది. యూఏఈకి చెందిన ఎయిర్లైన్ సంస్థ ఇత్తెహాద్ జులై 18న మరో కీలక ప్రకటన చేసింది. ఇత్తెహాద్, ఎమిరేట్స్ ఎయిర్ లైన్లు భారత్ నుంచి ఈ నెలాఖరు వరకు విమానాలను నడపబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఇదిలా ఉంటే.. కొన్ని విమానయాన సంస్థలు ఇప్పటికే భారత్ నుంచి యూఏఈకి నాన్ రిఫండబుల్ టికెట్లను విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. యూఏఈ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకూ టికెట్లు బుక్ చేసుకోకపోవడమే మేలని ట్రావెల్ ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. పర్యాటకులతో పాటు వ్యాపారవేత్తలు కూడా ప్రముఖంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో దుబాయ్ ఒకటి. దీంతో.. యూఏఈ, ఇండియా మధ్య మళ్లీ ఎప్పుడు రాకపోకలు సాగుతాయోనని చాలామంది ఎదురుచూస్తున్నారు.
రెసిడెన్సీ వీసాలు కలిగి.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకుని.. జూన్ 23 నుంచి మూడుసార్లు టెస్ట్ చేయించుకున్న వారిని అనుమతిస్తామని యూఏఈ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే.. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అధారిటీ(జీసీఏఏ) తాజా ఆంక్షల పొడిగింపుతో అలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇండియా-దుబాయ్ రూట్ మధ్య ఎమిరైట్స్ విమానాల్లో ఎకానమీ, ఫస్ట్ క్లాస్ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఆగస్ట్ 1 వరకూ ఇండియా, దుబాయ్ మధ్య విమానాలను నడిపేది లేదని ఎమిరైట్స్ స్పష్టం చేయడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubai, Flight, Flight tickets, India, UAE