అఫ్గానిస్థాన్ (Afghanisthan) లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా హసన్ అఖండ్ (Hassan Akhund) , డిప్యూటీ పీఎంగా ముల్లా బరాదర్ (Mullah Baradar) బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ఆరు దేశాలకు ఆహ్వానం పంపింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం రష్యా (Russia), చైనా (China), టర్కీ (Turkey), ఇరాన్ (Iran), పాకిస్థాన్ (Pakistan), ఖతర్ దేశాలను తాలిబన్లు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రారంభోత్సవానికి ఈ దేశాలు హాజరయ్యే అవకాశముందని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. విదేశాంగ విధానంలో భాగంగా ఈ దేశాలకు తాలిబన్లు ఆహ్వానాలు పంపారు.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ 1990లోనే తాలిబన్ల పాలనను గుర్తించాయి. ఇవి కాకుండా తాలిబన్లతో మరికొన్ని కొత్త దేశాలు సంబంధాలను ఏర్పరచుకున్నాయి. అయితే తాలిబన్ల పాలనను గుర్తించే ముందు చాలా దేశాలు వేచి ఉండే విధానాన్ని అవలంభిస్తున్నాయి. అఫ్గానిస్థాన్లో శాంతి కోసం గతంలో జరిపిన చర్చల్లో ఇరాన్, టర్కీ, రష్యా, చైనా లాంటి దేశాలు భాగం అయ్యాయి. ఈ కారణంతోనే తాలిబన్ల పాలనను ఈ దేశాలు అంగీకరించాయి.
అమెరికా నిష్క్రమణ తర్వాత.. ఆ లోటును పూడ్చే వ్యూహంలో భాగంగా ఈ దేశాలు తాలిబన్లతో మైత్రి కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఆహ్వానం పొందిన ఆరు దేశాల వ్యూహాలు ఏంటి? తాలిబన్ ప్రభుత్వంలో ఆ దేశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.
పాకిస్థాన్..
తాలిబన్లకు పాకిస్థాన్ రెండో నివాసం వంటిదనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలిసిన విషయం. ఇటీవల తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షాహిన్ ఓ ఇంటర్వ్యూలో దాయాది దేశం ప్రాముఖ్యత, ఆ దేశంతో తమ సంబంధాల గురించి వివరించారు. తమ పరిపాలనలో వ్యవహారాల్లో పాక్ కీలకమైందని, సరిహద్దు ప్రాంతాల్లో తాలిబన్ల కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుతున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తాలిబన్ నేతలకు కస్టోడియన్గా వ్యవహరిస్తుందని పాక్ మంత్రి షేక్ రషీద్ సైతం చెప్పడం గమనార్హం.
చైనా..
యూఎస్ బలగాలు అఫ్గానిస్థాన్ నుంచి నిష్క్రమించడంపై అమెరికాను చైనా విమర్శించింది. అయితే కాబూల్లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయానికొస్తే చాలా దేశాల మాదిరిగానే వేచి ఉండే విధానాన్ని అవలంభిస్తోంది. డ్రాగన్ దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను అఫ్గాన్లో (BRI) విస్తరించడానికి అవకాశం కోసం వేచి చూస్తుంది. ఇందులో అప్గానిస్థానే కీలకం.
అఫ్ఘాన్లో భద్రత, స్థిరత్వం లాంటి విషయాలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్ విషయంలో చైనా వైఖరిని అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. తాజా తాలిబన్ల ఆహ్వానంపై వస్తున్న మీడియా నివేదికలపై చైనా స్పందించలేదు.
రష్యా..
తాలిబన్లతో సంబంధాల కోసం ఎదురు చూస్తున్న దేశాల్లో రష్యా కూడా ఉంది. మాస్కో ఫార్మాట్ ద్వారా ఆ దేశం గతంలోనే తాలిబన్లతో చర్చలు జరిపింది. రష్యా, అఫ్గానిస్థాన్, చైనా, పాక్, ఇరాన్, భారత్ నుంచి ప్రత్యేక ప్రతినిధులతో అఫ్గాన్తో సంప్రదింపుల కోసం 2017లో మాస్కో ఫార్మాట్ అనే విధానాన్ని రూపొందింది.
2018 నవంబరులో రష్యా ఒక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి తాలిబన్ల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో పాటు అఫ్గాన్ హై పీస్ కౌన్సిల్ ప్రతినిధి బృందం, ఇతర 12 దేశాలను ఆహ్వానించింది. అఫ్గాన్లో శాంతిని స్థాపించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. 2018లో మరోసారి ఈ అంశంపై సమావేశం నిర్వహించింది. అయితే ప్రస్తుతం భద్రతా పరమైన ఆందోళనలు కూడా రష్యా ముందున్నాయి. దీంతో ఈ దేశం కూడా వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది.
ఇరాన్..
అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వైదొలిగిన తర్వాత ఇరాన్ కూడా తాలిబన్లతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. యూఎస్ నిష్క్రమణ.. అఫ్గాన్లో భద్రత, శాంతిని పునరుద్ధరించడానికి ఓ అవకాశంగా మారాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. అయితే టెహ్రాన్ ప్రభుత్వం గతంలో తాలిబన్లతో సంబంధాలను తెంచుకుంది. షియా, సున్నీ మత కలహాలు ఈ ఘర్షణకు ప్రధాన కారణం.
1998లో ఇరాన్ దౌత్యవేత్తల హత్యతో తాలిబన్ల పాలనలో ఇరుపక్షాలు దాదాపు యుద్ధానికి దిగాయి. అయితే ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య అంతటి శత్రుత్వం కనిపించట్లేదు. ఇరాన్కు అఫ్గానిస్థాన్కు ముఖ్యమైన పొరుగు దేశం. పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఆంక్షలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. వాణిజ్యం, కనెక్టివిటీ కోసం ఆ దేశం అఫ్గాన్పై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే తాలిబన్లను వ్యతిరేకించట్లేదు.
టర్కీ..
గతంలో తాలిబన్ల పాలన గురించి విమర్శించిన టర్కీ అధ్యక్షుడు టేయి ఎరోడాన్.. అనంతర కాలంలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. సంవత్సరాలుగా టర్కీ తాలిబన్లతో సంబంధాలను కొనసాగిస్తోంది. కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి టర్కీ లాజిస్టికల్ మద్దతు అందించే అవకాశముంది. ఇరు వర్గాల వారు ఒకరికొకరు ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. భద్రత, స్థిరత్వం, శరణార్థుల సంక్షోభం గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, వాణిజ్యం ద్వారా లాభం పొందాలని టర్కీ చూస్తోంది.
ఖతర్..
ఖతర్ 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల పాలనను గుర్తించకపోయినా, అనంతరం మిలిటెంట్ గ్రూపుతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. శాంతి చర్చల కోసం ఖతార్ను అమెరికా వేదికగా చేసుకుంది. రాజధాని దోహాలో అగ్రరాజ్య అధికారులు తాలిబన్ల బృందంతో సమావేశాలు నిర్వహించారు. ఈ దేశంలో తాలిబన్లకు రాజకీయ కార్యాలయం సైతం ఉంది. 2013 నుంచి 2020 వరకు తాలిబన్లు ఇక్కడి నుంచే ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపారు. అందువల్ల ఈ దేశం కూడా తాలిబన్లతో సఖ్యతనే కోరుకునే అవకాశాలు ఉన్నాయి.
తాలిబన్ల పరిపాలనను దేశాలు గుర్తిస్తాయా?
తాలిబన్లు అఫ్గాన్ను స్వాదీనం చేసుకున్నప్పటి నుంచి కాబూల్లో చైనా, పాకిస్థాన్ మాత్రమే తమ దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇతర దేశాలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే చాలా దేశాలు వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. యూఏఈ సహా పైన పేర్కొన్న ఆరు దేశాలు తాలిబన్ల పాలనను గుర్తించిన మొదటి దేశాలు కావచ్చు. మిగిలిన దేశాలు అఫ్గానిస్థాన్ అంశంపై ఎలా స్పందిస్తాయనే అంశంపై స్పష్టత లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, China, Pakistan, Russia, United states