Success Story : సాధించాలనే కసి, పట్టుదల ఉంటే విజయానికి పేదిరకం అడ్డుకాబోదని నిరూపించాడు అతడు. చదువుకునే స్థోమత లేక పదో తరగతితోనే స్కూలు మానేసి కుటుంబ పోషణ కోసం బీడీలు చుట్టిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా అమెరికాలో జడ్జి అయ్యాడు. తన విజయగాథతో ఎంతో మందికి స్పూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తే కేరళ(Kerala)లోని కాసర్గోడ్కు చెందిన సురేంద్రన్ కె. పటేల్(Surendran Pattel). సురేంద్రన్ ఇటీవల అమెరికాలోని జుడిషియల్ డిస్ట్రిక్ కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 1న, టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో ఉన్న 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా 51 ఏళ్ల సురేంద్రన్ కె పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పేదరికంలో పుట్టి యునైటెడ్ స్టేట్స్లో జడ్జి పదవిని చేపట్టే వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని సాగించిన అతడి జీవితంపై ప్రతిష్ఠాత్మక ది వీక్ మ్యాగజైన్లో ఓ కథనం ప్రచురితమైంది. దీంతో అతడి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.
కేరళలోని కాసరగోడ్లో అత్యంత పేద కుటుంబంలో సురేంద్రన్ కె. పటేల్ జన్మించారు. సురేంద్రన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులు. పేదరికంలో పుట్టడం వల్ల సురేంద్రన్ బాల్యం కష్టాలతో నిండిపోయింది. పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న సమయంలో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేయాల్సి వచ్చేది. కుటుంబ పోషణ నిమిత్తం సురేంద్రన్ యుక్తవయస్సులో ఉన్నప్పుడు తన సోదరితో కలిసి డబ్బు సంపాదించడానికి బీడీలు, సిగరెట్లను చుట్టారు. పేదరికం,ఆర్థిక కష్టాలతో పదోతరగతిలోనే చదువు మానేయాలని సురేంద్రన్ నిర్ణయం తీసుకున్నారు. చదువుకు స్వస్థి చెప్పి ఫుల్ టైమ్ బీడీలు చుట్టడం ప్రారంభించారు. అయితే కాలం అతని నిర్ణయాన్ని మార్చింది. ఒక ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ తాను చదువును కొనసాగించాలని నిర్ణయించుకుని EK నాయనార్ మెమోరియల్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తెచ్చుకున్నారు. ఆ టైంలో కూడా కళాశాలకు వెళ్లకుండా ఎక్కువ రోజులు బీడీలు మాత్రమే చుట్టేవారు. దీంతో ఆయనకు హాజరు శాతం తగ్గింది. దీంతో పరీక్షలకు కాలేజీ యాజమాన్యం అనుమతించలేదు. తన పరిస్థితి వివరించడంతో పర్మిషన్ ఇవ్వగా ఆ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. ఆ తర్వాత స్నేహితుల ప్రోద్బలంతో కోజికోడ్లోని గవర్నమెంట్ లా కాలేజీలో ఎల్ఎల్బీలో చేరారు. ఒక హోటల్లో పని చేస్తూ 1995లో లా పాస్ అయ్యారు. 1996లో కేరళలోని హోస్దుర్గ్లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన సురేంద్రన్ మంచి న్యాయవాదిగా అంచెలంచెలుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ పరిచయం సురేంద్రన్ జీవితాన్ని ఓ ములుపు తిప్పింది. ధావన్ సాయంతో సుప్రీం కోర్టులోనూ సురేంద్రన్ ప్రాక్టీసు ప్రారంభించారు. అక్కడ కూడా ఆయన విజయం సాధించారు.
ఉద్యోగుల కోసం కొత్త పాలసీ..లీవ్ లో ఉన్న ఉద్యోగిని డిస్ట్రర్బ్ చేస్తే రూ.1లక్ష జరిమానా
2004లో వృత్తిరీత్యా నర్సు అయిన శుభతో సురేంద్రన్ కి వివాహమైంది. 2007లో శుభకు అమెరికాలో స్టాఫ్నర్సు ఉద్యోగం వచ్చింది. దీంతో సురేంద్రన్ కుటుంబం అమెరికాలోని హ్యూస్టన్ షిఫ్ట్ అయింది. అమెరికాలోని చట్టాల మీద ఆసక్తితో.. సురేంద్ర యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో 2011లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని చట్టాలను అధ్యయనం చేశారు. లాయర్గా అక్కడ ప్రాక్టీస్ మెుదులు పెట్టి మంచి పేరు తెచ్చుకొన్నారు. కాంట్రాక్ట్ పని, కుటుంబ చట్టం, క్రిమినల్ డిఫెన్స్, సివిల్, కమర్షియల్ లిటిగేషన్, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన కేసులను సురేంద్రన్ చూసేవారు. తర్వాత సొంతంగా న్యాయ సంస్థను స్థాపించారు. డెమొక్రాటిక్ పార్టీతో జతకట్టారు. 2020లో న్యాయమూర్తి పదవి కోసం జరిగిన ఎన్నికలో సురేంద్రన్ ఓటమి పాలయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. సురేంద్రన్ యాసను ఆయన ప్రత్యర్థి అవమానించారు. దీన్నే ఆయుధంగా చేసుకున్న సురేంద్రన్ ప్రత్యర్థి యాసనే అంగీకరించలేని వ్యక్తి.. న్యాయం ఎలా చెప్పగలరంటూ ప్రచారం చేశారు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. జనవరి 1,2023న టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో ఉన్న 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా సురేంద్రన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ జడ్జి కావడం తనకు కూడా ఆశ్చర్యంగా ఉందన్న పటేల్.. ఎవరో మీ భవిష్యత్తును నిర్ణయిస్తారని అనుకోరాదని, మీకు మీరే మీ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని సూచించారు. మరోవైపు,సోషల్ మీడియాలో సురేంద్రన్ కె. పటేల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Success story, USA