ఓ ఉన్మాది సూసైడ్ బాంబర్గా మారి కొందరి ప్రాణాలు తీస్తే, మరో బాంబు పేలుడులో అతని భార్య, సోదరి చనిపోయారు. శ్రీలంకలో ఈనెల 21న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఓ టెర్రరిస్ట్ భార్య, సోదరి కూడా చనిపోయినట్టు ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ మేరకు అధికారికంగా తెలిపారు. ఈనెల 21న కొలంబోలోని షాంగ్రి లా హోటల్లో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకుని చనిపోయాడు. అతడిని ఓ ఫ్యాక్టరీ యజమానిగా పోలీసులు గుర్తించారు. అవిసావెల్లా - వెల్లంపిటియా రోడ్లో ఉండే ఓ ఫ్యాక్టరీ యజమాని ఇన్సాన్ సెల్వన్గా పోలీసులు నిర్ధారించారు. వరుస బాంబు పేలుళ్లపై విచారణ జరిపిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో షాంగ్రి లా హోటల్లో సూసైడ్ ఎటాక్ చేసిన వ్యక్తి భార్య, సోదరి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వకు 290 మందికి పైగా చనిపోయారు. అందులో 35 మంది విదేశీయులు ఉన్నారు. 9 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెల్వన్ కంపెనీలో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 24 మంది అనుమానితులను పట్టుకున్నారు. వరుస బాంబు పేలుళ్ల తర్వాత శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. శ్రీలంక వరుస పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.