శ్రీరామనవమి రోజున శరణు శరణంటూ ఇండియాకు చేరుకున్నారు లంకేయులు. ఆదివారం ఒక్కరోజే 19 మంది శ్రీలంక తమిళులు ఇండియాకు చేరుకోగా, ఇప్పటికే వచ్చినవాళ్లతో కలిపి శరనార్థుల సంఖ్య 39కి పెరిగింది. తద్వారా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ను నేరుగా తాకినట్లయింది. శ్రీలంకలో బతకలేక అక్కడి తమిళులు పడవ మార్గంలో తమిళనాడులోని ధనుష్కోటికి చేరుకున్నారు. వీళ్లకు ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ ఇంకా స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే రాబోయే రోజుల్లో లంకేయుల రాకలు పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇండియా ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. వివరాలివి..
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దెబ్బకు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది. అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల బాటపట్టారు. ఆందోళనలు హోరెత్తడంతో కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. కానీ ప్రధాని మహీంద రాజపక్స, ఆయన సోదరుడైన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాత్రం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నారు. లంకలో పరిస్థితులు చేయిదాటిపోయిన తరుణంలో పెద్దన్నలా భారత్ ఆదుకుంటున్నది. శ్రీలంకకు భారీ ఎత్తున ఇంధనం, బియ్యాన్ని సహాయంగా అందిస్తున్నది భారత్. అయితే, లంకలో బతకలేమంటూ ఇండియాకు వచ్చేస్తోన్నవారి సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది..
శ్రీలంకలోని జాఫ్నా, మున్నార్ ప్రాంతాల్లో తమిళులు ఎక్కువ సంఖ్యలో జీవిస్తారని తెలిసిందే. ఎల్టీటీఈ ఉద్యమం జోరుగా సాగిన కాలంలో ప్రత్యేక దేశం కోసం పోరాడిన తమిళులు.. ప్రభాకరన్ మరణం, ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం ఉక్కుపాదం తర్వాత ఆందోళనలకు స్వస్తి చెప్పడం విదితమే. కాగా, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో బతకలేకపోతున్నామంటూ ఇండియాకు శరణార్థులుగా వస్తున్నారు శ్రీలంక తమిళులు. జాఫ్నా, మున్నార్ ప్రాంతాలకు చెందిన 19 మంది శ్రీలంక తమిళులు ఇవాళ తమిళనాడులోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరంతా పడవల్లో సముద్రం దాటి వచ్చారు. వీళ్లలో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు.
సంక్షోభ శ్రీలంకలో బతకలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండియా వచ్చేస్తోన్న తమిళుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు ఇద్దరు పిల్లలతో దంపతులు సముద్రం దాటి తమిళనాడు వచ్చారు. ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా మొత్తం 39 మంది ఆశ్రయం పొందేందుకు భారత తీరానికి చేరుకున్నారు. భారత్లో తలదాచుకునేందుకు రాబోయేరోజుల్లో మరింత మంది తమిళనాడు సరిహద్దులకు చేరుునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆశ్రయం కల్పించే విషయమై భారత ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది.
మరోవైపు, సంక్షుభిత లంకను ఆదుకునేందుకు భారత్ తనవంతు సాయం చేస్తున్నది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి శ్రీలంకకు ఆర్థిక సహాయంగా భారత్ ఇటీవల ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. కొలంబోకు మరో రెండు ఇంధన నౌకలను రుణం కింద పంపుతున్నట్లు భారత హైకమిషన్ బుధవారం ప్రకటించింది. భారత్ నుంచి శ్రీలంకకు కూడా బియ్యం సరుకులు పంపుతున్నారు.
శ్రీలంకలోని తమిళుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీలంకకు బియ్యం, ప్రాణాలను రక్షించే మందుల వంటి నిత్యావసర వస్తువులను పంపేందుకు తమిళనాడు సిద్ధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం కేంద్రానికి తెలియజేశారు. అక్కడి భారత హైకమిషన్ ద్వారా పంపిణీకి అనుమతించాలని స్టాలిన్ కేంద్రాన్ని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.