భారత్ పొరుగుదేశం శ్రీలంకలో అశాంతి ఇంకా కొనసాగుతున్నది. శ్రీలంక ద్రవ్యోల్బణం జూన్ నాటికి 55 శాతానికి చేరింది.పెను ఆర్థిక సంక్షోభం (Sri Lanka economic crisis) కారణంగా జనం తిరుగుబాటుతో రాజకీయ అనిశ్చితి తలెత్తగా, ఇప్పటికే ప్రధాని పీఠం నుంచి రణిల్ విక్రమసింఘే తప్పుకోగా, అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) సైతం దేశం విడిచి పారిపోయారు. బుధవారం నాడు(13న) అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు గొటబయ రాజపక్స ప్రకటించడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్ష నాయకుడు, ఎస్జేబీ పార్టీకి చెందిన సుజిత్ ప్రేమదాస (Sajith Premadasa) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 20న ఆ ప్రక్రియ జరుగనుంది. వివరాలివే..
తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక ప్రజాగ్రహాలతో రగులుతోంది. మహీంద రాజపక్స పలాలయనం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసిఘే సైతం రాజీనామా చేయడం, గత వారం అధ్యక్షుడు గొటబయ కూడా దేశం విడిచి పారిపోవడంతో వారి అధికారిక భవనాలను నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకునే అవకాశాలున్నా అందుకు సైన్యం నిరాకరిస్తుండటంతో రాజకీయ పరిష్కారమే ఏకైక ఆప్షన్ గా మిగిలింది. దీంతో అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రతిపక్ష నేత సుజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు.
గొటబాయ రాజపక్సా రాజీనామా ఆమోదం పొందిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని సుజిత్ ప్రేమదాస వెల్లడించారు. సమగి జన బలవెగయ (ఎస్జేబీ) పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రేమదాస ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు. కొత్త పదవి చేపట్టే దిశగా ఇతర పక్షాలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు. పదవులు చేపట్టడానికి నేతలందరూ భయపడుతున్న వేళ ప్రేమదాస ముందుకురావడంతో ఆయన ఎన్నికకు తిరుగుతండదని తెలుస్తోంది.
సుజిత్ ప్రేమదాసను అధ్యక్ష పదవికి బరిలో దింపాలని ఎస్జేబీ ఇప్పటికే తీర్మానించింది. అయితే, ఆయన పార్టీకి కేవలం 54 ఎంపీ సీట్లే ఉన్నాయి. మొత్తం 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంటులో మెజార్టీ మార్కు 113 కావడంతో ప్రేమదాసకు ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి. మద్దతుపై మిత్రపక్షాలతో చర్చించామని ఎస్జేబీ నేత తెలిపారు. తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని.. శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తామని సుజిత్ ప్రేమదాస చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్సా కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సజిత్కు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు.
జులై 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు. రేపు (బుధవారం) గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని రణిల్ విక్రమసింఘెకు కూడా మంగళవారం అధికారికంగా తెలిపారు. రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sri Lanka, Sri Lanka Crisis, Srilanka