నిమ్మకాయ నుంచి ఇంధనం దాకా భారత్ లో ధరలు భగ్గుమంటున్నవేళ.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజుకింత చొప్పున బాదుడు కొనసాగుతోన్న సమయాన.. దేశంలో ప్రజలు శరాఘాతానికి విలవిల్లాడుతున్నా.. పొరుగుదేశానికి భారీ సహాయం అందిస్తూ భారత్ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నది. యుద్దం కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా ఇండియా అండగా నిలబడింది. పెద్ద పరిమాణంలో ఇంధనాన్ని, బియ్యాన్ని లంకు పంపేందుకు భారత్ చర్యలు చేపట్టింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ చేయుతనందిస్తున్నది. నిల్వలు అడుగంటి, ధరలు విపరీతంగా పెరిగిన శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ పంపింది. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఈ డీజిల్ శనివారం నాటికి శ్రీలకకు చేరింది. భారత్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకున్నది. శనివారం సాయంత్రమే దానిని దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలకు సరఫరా చేశారు.
భారత ప్రభుత్వం అప్పుగా శ్రీలంకకు పంపిన బిలియన్ డాలర్ విలువైన డీజిల్ తోపాటు ప్రభుత్వ హామీతోనే ఇండియన్ ఆయిల్ సంస్థ ఆరు వేల టన్నుల డీజిల్ను అందించనుంది. శ్రీలంకలో ప్రస్తుతం డీజిల్ కొరత కారణంగా రవాణా వ్యవస్థ దాదాపు స్థంభించిపోయింది. రాజపక్స ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత్ సాయం అందిస్తున్నది. ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న లంకు భారత్ త్వరలోనే వేల క్వింటాల బియ్యాన్ని కూడా పంపనుంది.
శ్రీలంక నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రిదాటిన తర్వాత ఈ మేరకు గెజిట్ జారీ అయింది. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel, Food prices, Fuel prices, India, Sri Lanka