సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఉన్నాయనే విషయం కొత్తేం కాదు. అయితే చైనా ఇలాంటి ఫేక్ అకౌంట్లతో మాయ చేయాలని చూస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వర్గాలు. సుమారు 350 ఫేక్ అకౌంటర్లతో చైనా తనకు అనుకూలంగా వార్తలను ఇంటర్నెట్లో విస్తృతం చేస్తోందని ఓ నివేదికలో తేలింది. దాంతోపాటు తన ప్రత్యర్థులను అప్రతిష్టపాలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తోందట. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తోందనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని చైనా వస్తువుల్ని నమ్మకూడదు అని అంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను కూడా నమ్మలేం అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?
పశ్చిమ దేశాల ఖ్యాతిని తగ్గించడం, విదేశాల్లో తమ దేశం ప్రభావం, ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా చైనా ఇలాంటి పనులు చేస్తోందని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెసిలెన్స్ (సీఐఆర్) నివేదిక ద్వారా ప్రాథమికంగా తెలిసింది. ఫేక్ సోషల్ నెట్వర్క్ల ద్వారా ఇతరులను కించపరిచేలా కార్టూన్లను వైరల్ చేస్తున్నారట. ఈ క్రమంలో తమ దేశం నుంచి బహిష్కరణకు గురైన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారట. అలా చైనీస్ టైకూన్ గువో వెంగుయ్, విజిల్ బ్లోయర్ లి మెంగ్ యాన్, స్టీవ్ బాన్నోన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటివాళ్ల గురించి ఆ కార్లూన్లు వేస్తున్నారు.
నెగిటివ్ ప్రచారం చేసే క్రమంలో ఇలాంటి కార్టూన్లలో కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారం కూడా పొందుపరుస్తున్నారట. ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల్లో ఇలాంటి అకౌంట్లు చాలా ఉన్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రొఫైల్ పిక్చర్లను జనరేట్ చేస్తున్నారు. అయితే ఈ నెట్వర్క్లకు చైనాకు నేరుగా సంబంధం ఉందని బలైమన ఆధారాలు లేవట. అయితే చైనాకు చెందిన అకౌంట్లే అని సీఐఆర్ చెబుతోంది. ఎందుకంటే ఆ నెట్వర్క్ల్లో చైనాకు చెందిన ప్రతినిధులు, మీడియాకు సంబంధిన వార్తలు, కథనాలు ఎక్కువగా వస్తున్నాయట. దాని ఆధారంగానే అవి చైనా అనుకూల ఫేక్ నెట్వర్క్లని సీఐఆర్ చెబుతోంది.
* అమెరికాపై వ్యతిరేక ప్రచారం
మరోవైపు ఇలాంటి నెట్వర్క్ల్లో యూఎస్కు సంబంధించిన పేలవమైన మానవ హక్కుల ప్రస్తావన కూడా ఉంటోందట. జార్జ్ ఫ్లాయిట్ ఘటన, ఆసియన్ల పట్ల చూపిస్తున్న వివక్ష లాంటివి ఆ పోస్టుల్లో ప్రస్తావిస్తున్నారట. ఇంకొన్ని ఖాతాల్లో జిన్జియాంగ్ రీజియన్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి కూడా రాస్తున్నారు. ఇవన్నీ చైనాకు అనుకూలంగా, లేదంటే చైనా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉంటున్నాయట.
హ్యాష్ట్యాగ్లను మ్యాపింగ్ చేసి సీఐఆర్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొత్తగా క్రియేట్ అయిన అకౌంట్లు ర్యాండమ్గా జనరేట్ అయిన పేర్లు, ఐడీలతోనే అని తెలుసుకున్నారు. అలాగే ఆ ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య కూడా పరిమితంగానే ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటు అలాంటి ఖాతాలకు రెడ్ ఫ్లాగ్స్ కూడా రెయిజ్ అయినట్లు తేల్చారు. కొన్ని ఖతాల్లో ఒరిజినల్ కంటెంట్ ఉంటుండగా, కొన్నింటిలో ఫార్వర్డ్, రీట్వీట్లు మాత్రమే ఉంటున్నాయట. అలా ఎక్కువమందికి చేరొచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోందని నివేదిక చెబుతోంది. దీనిని ఆస్ట్రోటర్ఫింగ్ అని అంటారట.
* డూప్లికేట్ ఫోటోలతో ప్రచారం
ముందుగా చెప్పినట్లు ఆ ఖాతాలకు ఒరిజినల్ ఫొటోలు ఉండవు. అన్నీ ఏఐతో రూపొందిన డూప్లికేట్ ఫొటోలేనట. అచ్చంగా ఒరిజినల్లానే కనిపిస్తాయట. వేరే ఖతాదారుల ఫొటోలు దొంగిలించి... వాడకుండా ఏఐ ద్వారా ఏకంగా కొత్త ఫొటోనే రూపొందిస్తున్నారట. ఇప్పటికే చాలా సోషల్ మీడియా కంపెనీలు ఇలాంటి ఖాతాలను గుర్తించి తొలగించాయట. అయితే ఇంకా కొన్ని ఇలాంటి ఖాతాలు కనిపిస్తున్నాయని సీఐఆర్ చెబుతోంది. ఇదన్నమాట చైనా ప్రచారం లెక్క.
Keywords
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, China, Social Media, US-China