Spain PM phone hacked, : ఇజ్రాయెల్ కి చెందిన 'ఎన్ఎస్వో' గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి భారత్ లోని అనేక మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్ల హ్యాకింగ్కు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పెద్ద రచ్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు స్పెయిన్ లో పెగాసస్ స్పైవేర్ కలకలం రేగుతోంది. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉండే పెగసస్ స్పైవేర్ ద్వారా స్పెయిన్ ప్రధానమంత్రి, రక్షణ మంత్రుల ఫోన్లు గత ఏడాది హ్యాక్ అయినట్లు స్పెయిన్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ప్రధాని పెడ్రో శాంచెజ్ మొబైల్ ఫోన్ 2021 మేలో రెండుసార్లు హ్యాకింగ్ కు గురికాగా, రక్షణశాఖ మంత్రి మార్గరిటా రోబెల్స్ ఫోన్ ని జూన్ లో టార్గెట్ చేశారని స్పెయిన్ విదేశాంగ సహాయ మంత్రి ఫ్లెక్సీ బోలా ఓస్ సోమవారం సోమవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో తెలిపారు.
హ్యాకింగ్ ద్వారా చాలా విషయాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది.. ఈ అంశానికి సంబంధించిన నివేదికలను విచారణ కోసం జాతీయ కోర్టుకు అందించాం.. ఇది చట్టవిరుద్ధమైన, అనధికారిక చర్య అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.. ఇది విదేశాల నుంచి జరిగినట్లు తెలుస్తోంది.. దానికి చట్టబద్ధత లేదు మంత్రి ఫ్లెక్సీ బోలా ఓస్ అన్నారు. కాగా, 2017- 2020 మధ్య ఉత్తర కాటలోనియాలో పదుల సంఖ్యలో నేతలు, సామాజిక కార్యర్తల ఫోన్లు పెగాసస్ బారిన పడినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం తెలిపింది. ఆ విషయంపై వివరాలు వెల్లడించేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. స్పెయిన్లో కాటలోనియాలో వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్ను వినియోగించినట్టు తేలింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రధాని శాంచెజ్కు వేర్పాటువాద పార్టీ ఈఆర్సీ మద్దతు తప్పనిసరైంది. ఇదే సమయంలో పెగాసస్ స్పైవేర్ అంశం తెరపైకి రావడంతో ఏప్రిల్ 28న పార్లమెంట్లో ఆర్థిక ప్యాకేజీ బిల్లుకు వ్యతిరేకంగా ఈఆర్సీ ఓటు వేసింది. దీంతో ప్యాకేజీకి ఆమోదం లభించలేదు.
ALSO READ Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
ఇక, పెగాసస్ స్పేవర్ ద్వారా భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాల అధ్యక్షులు, ప్రముఖులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల సహా వేలాది మంది ఫోన్లు హ్యాకింగ్కు గురయినట్టు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే. 50,000 నంబర్ల డేటా బేస్ లీకవడంపై ది గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, ది వైర్, ఫ్రంట్లైన్, రేడియో ఫ్రాన్స్ వంటి 16 మీడియా సంస్థల జర్నలిస్టులు పరిశోధనలు చేశారు. భారత్ లోనూ దీనిపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు ఓ కమిటీని కూడా నియమించింది.