డొనల్డ్ ట్రంప్ ను ఆప్తమిత్రుడిగా ప్రధాని మోదీ (PM Modi) అభివర్ణించిన రోజుల్లో అమెరికా-భారత్ మధ్య ఒక స్థాయిలో ఉండిన సంబంధాలు జో బైడెన్ రాకతో ప్రభావితమయ్యాయి. రక్షణ రంగంలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్ సర్కారు గుర్రుగా ఉన్నది. ప్రధానంగా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన యాంటీ మిస్సైల్ వ్యవస్థపై ఏకంగా ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్న తరుణంలో అగ్రరాజ్యానికి బుద్ది చెప్పేలా భారత ప్రధాని మోదీ మంత్రాంగం మొదలుపెట్టారు. భారత్ కు చిరకాల మిత్రురాలైన రష్యాతో బంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరుగనున్న పుతిన్-మోదీ సదస్సుకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. వివరాలివి..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. డిసెంబర్ 6న ఆయన భారత్ లో పర్యటించనున్నారు. రెండు దేశాల 21వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఇండియా వస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ చర్చలు జరుపుతారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు గత ఏడాదే కలవాల్సి ఉన్నా, కరోనా కారణంగా సదస్సు వాయిదా పడింది. భారత్, రష్యా శిఖరాగ్ర సదస్సులు ఒకసారి అక్కడ జరిగితే మరోసారి ఇక్కడ జరగడం సంప్రదాయంగా వస్తోంది.
భారత్, రష్యా 21వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా అధినేతలతోపాటు రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల మధ్య 2ప్లస్2 చర్చలు కూడా జరుగుతాయి. పుతిన్ తోపాటు రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్, రక్షణ మంత్రి సర్గే షోయిగు భారత్ లో పర్యటిస్తారు. వీళ్లిద్దరూ మన విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అవుతారు.
మోదీ-పుతిన్ భేటీలో ప్రధానంగా ఆసియా పసిఫిక్ రీజియన్ లో చైనా దూకుడు, అఫ్గానిస్థాన్, సిరియా పరిణామాలు, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అదే సమయంలో అత్యాధునిక S-400 యాంటీ మిస్సైల్స్ సిస్టమ్ ఒప్పందాలపైనా ఇద్దరు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. డ్రోన్ నుంచి బాలిస్టిక్ క్షిపణుల దాకా ఎలాంటి మారణాయుధాలనైనా తుత్తునీయాలు చేగలిగిన ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పుతిన్ చివరిసారిగా 2018లో ఇండియాలో పర్యటించినప్పుడు ఈ మేరకు 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు జరగ్గా, ఇటీవలే ఎస్-400 వ్యవస్థలు ఇండియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా,
రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థను ప్రపంచ దేశాలు కొనరాదని, తాము రూపొందించిన ఎఫ్-16 యుద్ధవిమానాలను నిర్వీర్యం చేయడానికే రష్యా సదరు ఆయుధాలను తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ ఎస్-400 వ్యవస్థను దిగుమతి చేసుకోవడం ప్రారంభం కావడంతో ఆంక్షలు విధించే దిశగా అమెరికా ఆలోచిస్తోంది. భారత్ పై కాట్సా ప్రయోగించేందుకు వెనుకాడబోమని బైడెన్ సర్కారు హెచ్చరిస్తోంది. ‘ఆంక్షల ద్వారా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం(సీఏఏటీఎస్ఏ -కాట్సా) అస్త్రాన్ని భారత్ పై ప్రయోగించాలనేదానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోనప్పటికీ, దీనిపై ఆలోచన చేస్తున్నట్లు బైడెన్ సర్కారు ఇటీవల ప్రకటన చేయడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Pm modi, Russia, Vladimir Putin