భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో గతేడాది జూన్ 15న ఇరు దేశాల సైనికుల మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. చైనా సైనికులు సరిహద్దు దాటి భారత్ భూభాగంలో ఉంటున్న సైనికులతో గొడవలకు దిగారు. బలమైన ఆయుధాలను వెంట తెచ్చుకుని దాడులు చేశారు. ఇటు భారత సైనికులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వీరోచిత పోరాటం చేశారు. చైనా సైనికులకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు చనిపోయినట్టు మన దేశ ఆర్మీ అధికారికంగానే ప్రకటించింది. అయితే చైనా సైనికులు ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఆ దేశం వెల్లడించలేదు. పైగా వెల్లడించకపోవడమే మంచిదని అప్పట్లో ఆ దేశ అధికారిక మీడియా చెప్పుకొచ్చింది. ఎంత మంది చనిపోయారన్నది బయటపెడితే ప్రజల్లో భావోద్వేగాలు ప్రభలుతాయనీ, అది ఇరుదేశాలకు మంచిది కాదని కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
2020వ సంవత్సరం జూన్ 15న జరిగిన ఈ ఘటనలో చైనాకు సంబంధించిన సైనికులు ఎంత మంది చనిపోయారన్నదానిపై ఓ రష్యా మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. టాస్(TASS) అనే రష్యన్ పత్రిక ఫిబ్రవరి 10వ తారీఖున గాల్వన్ లోయలో గతేడాది జరిగిన దాడులపై ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చింది. ఈ ఘటనలో చైనాకు సంబంధించి కనీసం 45 మంది సైనికులు మరణించారని ఆ పత్రిక తేల్చిచెప్పింది. గాల్వన్ లోయలో జరిగిన ఘటన తర్వాత ఇరు దేశాలు సరిహద్దుల్లో తమ బలగాల సంఖ్యను మరింత పెంచాయని స్పష్టంచేసింది.
ఒక్కో దేశం 50వేల సైనికులను సరిహద్దుల్లో ఉంచాయని చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయనీ, ప్రస్తుతం ఆ పరిస్థితులను చక్కదిద్దే పనిలో ఇరు దేశాలు ఉన్నాయని పేర్కొంది. సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాలను క్రమంగా తగ్గించుకునే దిశగా రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయని రాసుకొచ్చింది. కాగా, గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్, తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఆ దాడుల్లోనే వీరమరణం పొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Galwan Valley, India, India-China, Indo China Tension