ఉక్రెయిన్ ను పదే పదే రెచ్చగొట్టి.. వెనుక మేముంటామని ముందుకు తోసి.. చివరికి ఆ దేశంపై రష్యా యుద్దానికి దిగేందుకూ అసలు కారకురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా.. యుద్దం మొదలైన నెల రోజుల తర్వాత కూడా తన తీరును మార్చుకోలేదు సరికదా, కొత్త థియరీలను చొప్పిస్తూ, భారత్ లాంటి మిత్రదేశాలపైనా వంకర వ్యాఖ్యలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గత కొన్ని గంటలుగా చేస్తోన్న ప్రకటనలు యుద్ధానికి మరింత ఆజ్యంపోసేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది..
ఉక్రెయిన్పై యుద్ధంలో భాగంగా జీవ, రసాయనిక ఆయుధాలను రష్యా ప్రయోగించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అసలు బాధ్యతను మరుగుపరచి, వేరొకరిపై నిందలను మోపే ఉద్దేశం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మాటల్లో కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు బైడెన్ చేసిన హెచ్చరికల్లో ఇది చాలా తీవ్రమైనది కావడం గమనార్హం.
ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా యుద్ధం కొనసాగుతోంది. దాదాపు నెలరోజులుగా ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా విధ్వంసం తప్ప మరోటి కనిపించడంలేదక్కడ. యూరప్ లో వాతావరణం వేడెక్కిన తరుణంలో అమెరికా ప్రెసిడెంట్ పోలాండ్ పర్యటన చేపట్టడం రష్యాను రెచ్చగొట్టినట్లయింది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్తో ముఖాముఖి చర్చించడానికి తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ ప్రజల ఆలోచనలన్నిటినీ తాను పుతిన్కు వివరిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే,
ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్పై అమెరికా మరోసారి తమ అక్కసుని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా చర్యలను తప్పుపట్టడానికి కూడా భారత్ జంకుతోందని, రష్యా వ్యతిరేక కూటమిపైనా భారత్ నిర్ణయాలు అస్థిరంగా ఉన్నాయని, రష్యాపై ఆంక్షలకు భారత్ భయపడుతోందని బైడెన్ వ్యాఖ్యానించినట్లు అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికన్ సీఈఓల రౌండ్టేబుల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.