ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి పని చేయాలని, ప్రపంచమంతా ఏకం కావాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) పిలుపునిచ్చారు. మంగళవారం ఇంటర్పోల్ 90వ జనరల్ అసెంబ్లీని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నేరస్థులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయడం వేగవంతం చేయాలని ఇంటర్పోల్(INTERPOL)ను కోరారు. అవినీతిపరులు, ఉగ్రవాదులు, డ్రగ్ కార్టెల్స్, ముఠాలు, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్కు(Criminals) సురక్షిత ప్రాంతాలు ఉండకూడదని చెప్పారు.
నేరస్థులకు సురక్షితమైన ప్రాంతాలు ఉండకూడదు
అవినీతిపరులకు నేరాలు చేసి, ఆదాయాలు పొందేందుకు వీలుగా ఉన్న ప్రాంతాలను నిర్మూలించాలని మోదీ తెలిపారు. నేరస్థుల ఆదాయ మార్గాలను ఆపేయాలని చెప్పారు. ఇందుకు ప్రపంచమంతా ఏకమై కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంలో తమ లిమిటేషన్స్ గురించి ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్ సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశానికి సంబంధించి 750కి పైగా రెడ్ కార్నర్ నోటీసులు యాక్టివ్గా ఉన్నాయి. అందులో దాదాపు 200కి పైగా పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, హఫీజ్ సయీద్ వంటి వారిపైనే ఉన్నాయి.
నోరు విప్పని పాకిస్థాన్ ప్రతినిధులు
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్లపై ఇండియా రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. వీరిద్దరు భారత భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయూద్ పాకిస్థాన్లో తలదాచుకున్నారని భావిస్తున్నారు. అయితే మంగళవారం జరిగిన ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీలో ఈ నేరస్థులకు సంబంధించి ప్రశ్నలకు పాకిస్థాన్కు చెందిన టాప్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ కోసం ఢిల్లీకి ఇస్లామాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందంలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్ ఉన్నారు. దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను భారత్కు పాకిస్థాన్ అప్పగిస్తుందా? అని వార్తా సంస్థలు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పడానికి బట్ నిరాకరించారు.
ప్రపంచవ్యాప్తంగా నిఘా
ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (INTERPOL) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీసు సంస్థ. ఇందులో భారతదేశం సహా 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేరాలు, నేరస్థులపై సమాచారాన్ని పంచుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు. నేరస్థులను పట్టుకుకోవడంలో ఇంటర్పోల్ ఆయా దేశాలకు సహాయం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నేరస్థులపై నిఘా వేసే అవకాశం కల్పిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Delhi, Pm modi, Prime minister