దాయాది దేశం పాకిస్తాన్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పేరు మార్మోగిపోయింది. ప్రజలంతా ఆయన ఫ్లకార్డులు పట్టుకుని.. తమకు మద్దతునివ్వాల్సిందిగా మోడీని అభ్యర్థించారు. పాక్ ప్రభుత్వం తమను ఆక్రమించుకుని నానా హింసలు పెడుతున్నదని.. తమకు మద్దతు ఇవ్వాలని వాళ్లు కోరారు. ప్రధాని మోడీ తో పాటు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ (Joe biden), న్యూజిలాండ్ పీఎం జసిందా (Jacinda) ఫోటోలను చేతబూని భారీ నిరసన కార్యక్రమం చేశారు. పాక్ ప్రభుత్వ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. తమకు స్వతంత్య్రం ఇవ్వాల్సిందేనని... లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తాము స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నామని.. తమకు మద్దతు కావాలని కోరుతూ పాకిస్తాన్ లోని సింధ్ ప్రజలు ఈ భారీ నిరసన చేపట్టారు.
సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా పీఎం మోడీ, బైడెన్, జసిందాల మద్దతు కోరారు. సింధ్ స్వేచ్ఛ కోసం ఆ నాయకుల జోక్యాన్ని అభ్యర్థించారు. పాక్ లోని సాన్ పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది.
సింధ్ స్వేచ్ఛ గురించి పలువురు నిరసనకారులు మాట్లాడుతూ... ‘సింధ్ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉన్నది. ఇది వేధభూమి. ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ఉన్న సింధు లోయ నాగరికత ఉద్భవించింది ఇక్కడే. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఆక్రమణదారుల పాలన సాగుతున్నది. ఇక్కడి వనరులను పాక్ ఆక్రమిస్తున్నది. ఇక్కడి చరిత్రను, సంస్కృతీ, సంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా దాని కుట్రలు ఫలించడం లేదు. ఎంత ఒత్తిళ్లు తెచ్చినా.. ఎన్ని కుట్రలు చేస్తున్నా.. ఇక్కడి ప్రాంత ప్రజలు మాత్రం సింధ్ కు ఉన్న ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటున్నారు. దాని గుర్తింపును అలాగే కాపాడుతున్నారు. సామరస్యపూర్వకంగా కలిసి మెలిసి జీవిస్తూ.. సహనాన్ని చాటుతున్నారు. కానీ పాక్ మాత్రం మాపై ఆక్రమణకు దిగుతోంది....’ అని అన్నారు.
సింధ్ లో స్వేచ్ఛ కోసం అనేక జాతీయవాద పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పలువురు హక్కుల కార్యకర్తలు ప్రపంచ వేదికల మీద కూడా వారి హక్కుల గురించి, అణచివేత గురించి ప్రస్తావిస్తున్నారు. కొద్దికాలంగా ఈ ప్రాంత ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్నది. ఓ పక్క పాక్ సైన్యం.. హక్కుల కార్యకర్తలను జైళ్లలో పెడుతూ.. వారికి అనుకూలంగా మాట్లాడిన వారిని హింసిస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో సింధ్ ప్రజలు ప్రధాని మోడీ జోక్యం కోరడం గమనార్హం.
Published by:Srinivas Munigala
First published:January 18, 2021, 17:50 IST