Kim Jong Un Warning : శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తర కొరియా(North Korea)రెడీ ఉందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un)తెలిపారు. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ వ్యాఖ్యానించారు. అమెరికా, దక్షిణ కొరియాతో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. తద్వారా మరోసారి అణు పరీక్షలు జరిపేందుకు ఉత్తర కొరియా సన్నద్ధమవుతోందంటూ పరోక్షంగా తెలిపారు
1950-53 కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవం సందర్భంగా జులై 27న మాజీ సైనికులను ఉద్దేశించి కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. 1950-53 కొరియా యుద్ధం సంధితో ముగిసినప్పటికీ, ఉత్తర కొరియా దానిని అమెరికాపై విజయంగా పరిగణిస్తుంది. ప్రతి ఏడాది 'విక్టరీ డే' పేరుతో సంబరాలు జరుపుకొంటుంది. ఈ వార్షికోత్సవ వేడుకలో కిమ్ మాట్లాడుతూ..అమెరికా నుంచి వస్తున్న అణు బెదిరింపుల కారణంగా ఉత్తర కొరియాకు ఆత్మరక్షణ పటిష్టం చేసుకునే అత్యవసరం ఏర్పడిందన్నారు. ఉత్తర కొరియాను అమెరికా ఒక బూచిలా చూపుతోందని,ఉత్తర కొరియా భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతోందని అన్నారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. ఉత్తర కొరియా సాధారణ సైనిక విన్యాసాలు చేపట్టినా రెచ్చగొట్టే చర్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని కిమ్ మండిపడ్డారు.నార్త్ కొరియా నిత్యం చేసే సైనిక విన్యాసాలను కవ్వింపు చర్యలుగా అమెరికా అపార్థం చేసుకుందన్నారు. తన చర్యలను సమర్థించుకుంటూ, ఉత్తర కొరియాను వేలెత్తి చూపిస్తోందని కిమ్ అగ్రరాజ్యంపై విమర్శలు చేశారు. అణుముప్పు సహా ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. ఇక,దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్ను యుద్ధ ఉన్మాదిగా కిమ్ అభివర్ణించారు. మేలో దక్షిణ కొరియా అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గర నుంచి అమెరికాతో సైనిక సహకారాన్ని యోల్ మరింత బలోపేతం చేశారు. తద్వారా ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ముందస్తు దాడులకు పాల్పడితే అక్కడి యూన్ సుక్-యోల్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కిమ్ అన్నారు.
Pakistan first Hindu woman DSP : పాకిస్తాన్ లో మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టదలిచిన యుద్ధ విన్యాసాలను.. తమపై దండయాత్రకు రిహార్సల్స్గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే అమెరికా, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా,అమెరికా, దక్షిణ కొరియాను చేరుకోగలిగే పలు రకాల క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా ప్రయోగించింది. చర్చలకు అమెరికా, దక్షిణ కొరియా చేసిన ప్రతిపాదనలను ఇప్పటికే ఉత్తర కొరియా తిరస్కరించింది. తమ ప్రత్యర్థులు తొలుత శత్రుత్వ విధానాలను విడనాడాలని హితవు పలికింది. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందాలంటే ఉత్తర కొరియా తొలుత అణ్వాయుధ కార్యక్రమానికి స్వస్తి పలకాలని అమెరికా నేతృత్వంలోని దౌత్యవేత్తలు ఉత్తర కొరియాను కోరుతున్నారు.
కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా 2017 తర్వాత ఇప్పటిదాకా అణు పరీక్షకు పూనుకోలేదు. అయితే, కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. ఉత్తర కొరియా ఏ సమయంలోనైనా అణు పరీక్షలు నిర్వహించవచ్చని అమెరికా గత నెలలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kim jong un, North Korea