NEW ZEALAND ON THURSDAY TEMPORARILY SUSPENDED ENTRY FOR ALL TRAVELLERS FROM INDIA SSR
New Zealand: భారత ప్రయాణికులకు న్యూజిలాండ్లోకి నో ఎంట్రీ.. ఆ దేశ ప్రధాని కీలక ప్రకటన..
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్
భారత్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణాలపై రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఆక్లాండ్లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్లో అధికారిక ప్రకటన చేశారు. న్యూజిలాండ్ ఇప్పుడు మాత్రమే కాదు తొలుత కరోనా విజృంభించిన సమయంలో...
న్యూఢిల్లీ: భారత్లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే.. న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి న్యూజిలాండ్ వచ్చే భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే ఆ దేశపు పౌరుల రాకపై కూడా న్యూజిలాండ్ తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణాలపై రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఆక్లాండ్లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్లో అధికారిక ప్రకటన చేశారు. న్యూజిలాండ్ ఇప్పుడు మాత్రమే కాదు తొలుత కరోనా విజృంభించిన సమయంలో కూడా ముందుగానే జాగ్రత్త పడింది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన వెంటనే ఇతర దేశాల నుంచి రాకపోకలపై గతంలోనూ న్యూజిలాండ్ నిషేధం విధించింది. అందుకే ఆ దేశంలో కరోనా అంతగా ప్రభావం చూపలేకపోయింది. దాదాపు 40 రోజుల నుంచి న్యూజిలాండ్లో ఎలాంటి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదంటే ఆ దేశం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ నుంచి ప్రయాణాలపై న్యూజిలాండ్ విధించిన ఆంక్షలు ఏప్రిల్ 11 నుంచి 28 వరకూ కొనసాగనున్నాయి. న్యూజిలాండ్లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు. గురువారం ఒక్కరోజే న్యూజిలాండ్కు వెళ్లిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ 23 మందిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. దీంతో.. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది.
ఇదిలా ఉండగా.. భారత్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇతర దేశాలను కూడా కలవరపెడుతున్నాయి. భారత్లో గడచిన 24 గంటల్లో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో 685 మంది కరోనా కారణంగా భారత్లో మృత్యువాత పడ్డారు.
కరోనా నుంచి కోలుకుని 59,258 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. భారత్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 1,66,862 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్లో కూడా భారత్ ముందు వరుసలోనే ఉండటం చెప్పుకోదగ్గ విషయం. భారత్లో 9,01,98,673 డోస్ల వ్యాక్సిన్ను ప్రజలకు టీకా రూపంలో ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.