ఆఫ్ఘనిస్తాన్లో అనుకున్నదే జరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజలపై తాలిబన్లు దాడులకు తెగబడ్డారు. కాబూల్ ఎయిర్ పోర్టు బయట జరిగిన బాంబు దాడుల్లో దాదాపు 13 మంది చనిపోయారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలో దాదాపు 70 మంది గాయాలపాలైనట్టు ఆల్ జజీరా మీడియా పేర్కొంది. కాబూల్ ఎయిర్పోర్టు ముందు ఆత్మాహుతి దాడి జరిగిందని తాలిబన్ అధికారి తెలిపారు. ఈ నెలాఖరు లోపు అమెరికా బలగాలు ఆఫ్ఘన్ వదిలి వెళ్లిపోవాలని తాలిబన్లు హెచ్చరించిన తరువాత ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనలో పలువురు అమెరికా సైనికులు కూడా గాయపడినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు.
ఆప్ఘనిస్థాన్ వదిలి వెళ్లేందుకు వేలాది మంది కాబూల్ ఎయిర్పోర్టుకు వస్తున్న తరుణంలో ఈ దాడి జరగడంతో అంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్లో గత 20 ఏళ్లుగా తమకు సాయం చేసిన ఆ దేశ పౌరులను తమతో పాటు తీసుకెళ్లేందుకు అమెరికా, బ్రిటన్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.మరోవైపు ఈ దాడి ఘటనపై అమెరికా స్పందించింది. కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర బాంబు దాడి జరిగిన విషయం వాస్తవమే అని.. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో తెలియదని అన్నారు. కాబూల్ ఎయిర్పోర్టు సమీపంలో దాడి జరగొచ్చని హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారని విదేశీ ప్రతినిధి తెలిపారు. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర అబ్బే గేట్ దగ్గర పేలుడు సంభవించిందని.. బారన్ హోటల్ దగ్గర రెండో పేలుడు సంభవించిందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul blast