కాబూల్ విమానాశ్రయం పూర్తి నియంత్రణలో ఉందని, అక్కడి నుంచి పౌరుల తరలింపు కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న సంక్షోభంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆఫ్గనిస్తాన్ ను విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అయితే.. కాబుల్ ను తాలిబన్లు వేగంగా చేజిక్కుంచుకోవడంపై బైడెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాలిబన్ల కన్నా ప్రమాదకర శక్తులు ఉన్నాయని.. వాటిని అడ్డుకట్ట వేసేందుకే తాము అఫ్గాన్ నుంచి వైదొలిగామన్నారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు పనిచేసిందన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి బయటపడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 18 వేల మందిని ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలించామన్నారు. ఇంకా 6000 మంది అమెరికన్ సైనికులు సహాయక చర్యల కోసం అక్కడ ఉన్నారని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఖైదీలను తాలిబన్లు విడుదల చేయడంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ఉగ్రవాదులు పెద్ద ముప్పుగా మారుతారన్నారు.
Afghanistan: తాలిబన్ల భయంతో ఆఫ్గాన్ నుంచి పారిపోతున్న ప్రజలు.. ఫొటోలు
ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిపై బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి ఇతర మిత్రదేశాలతో కూడా అమెరికా మాట్లాడిందని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి ఆగస్టు 31 వరకు తమకు గడువు ఉందన్నారు. ఈ లోగా వేలాది మందిని అక్కడి నుంచి తరలించాల్సి ఉందన్నారు. సిరియా, తూర్పు ఆసియా దేశాల్లో అల్ ఖైదా, ఐసిస్ లు ప్రాబల్యం పెంచుకున్నాయన్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే అమెరికా దాదాపు 30 వేల మంది ఆఫ్గాన్ శరణార్థాలకు ఆశ్రమం ఇవ్వనుంది. 20 ఏళ్లుగా ఆఫ్గాన్ లోని అమెరికా సైన్యానికి సహాయం చేసి ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన వారందరికీ ఆశ్రమం కల్పించేందుకు అగ్రరాజ్యం ఏర్పాట్లు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ మన దగ్గర బిర్యానీ తయారీ ఖర్చును పెంచనున్నాయి. బిర్యానీ తయారీలో వినియోగించే డ్రైఫ్రూట్స్ ఎండుద్రాక్ష, అల్మండ్, అత్తి, పిస్తాపప్పు, జీడిపప్పులో అత్యధికంగా ఆఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతూ ఉంటాయి. కొన్ని మసాలా ఐటెమ్స్ కూడా అక్కడి నుంచే సరఫరా అవుతాయి. అయితే ఆఫ్గాన్ లో గొడవల కారణంగా వీటి దిగుమతి ఆగిపోవడంతో డిమాండ్ అధికమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బిర్యానీ తయారీ భారం అయ్యే ప్రమాదం ఉందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే బిర్యానీ ధర పెంచక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రైఫూట్స్ కొరత అధికమైతే అవి లభించక బిర్యాటీ టేస్ట్ కూడా మారే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.