IMF Chief on Indias Wheat Export Ban : యావత్ ప్రపంచానికి అన్నం పెట్టగలిగే సత్తా భారత్ కు మాత్రమే ఉంది.. సంక్లిష్ట సమయాల్లో ఇండియా మానవాళికి అండగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో భారత్ గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన క్రమంలో ప్రపంచ దేశాలు గగ్గోలుపెడుతున్నాయి. సంక్షోభ సమయంలో గోధుమల ఎగుమతులు నిషేధించడం సరికాదంటున్నాయి. ఈ క్రమంలోనే గోధుమల ఎగుమతి నిషేధం నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్ను అర్థిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి( IMF) చీఫ్ క్రిస్టలీనా జార్జీవా మంగళవారంపేర్కొన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె గుర్తుచేశారు.
. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన క్రిష్టాలినా జార్జియోవా ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..."భారత్లో వేసవి వేడిమి కారణంగా ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గాయని మేం గుర్తించాం. అదే విధంగా భారత్ తమ 135 కోట్లమంది జనాభాకు ఆహార ధాన్యాలు సమకూర్చాలన్న విషయమూ మాకు తెలుసు. కానీ గోధుమల ఎగుమతి నిషేధంపై పునరాలోచించాలని భారత్ ని అర్థిస్తున్నాం. పలు దేశాలు ఇతర దేశాలకు గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆహార ధాన్యాలు లేక ఆ రెండు దేశాల్లో అశాంతి నెలకొంటుందన్నారు.
ALSO READ Video : షాకింగ్.. కూల్ డ్రింక్ లో బల్లి..మెక్డొనాల్డ్స్ అవుట్ లెట్ సీజ్
అయితే.. ఆహార కొరత కారణంగా తమను విజ్ఞప్తి చేసిన దేశాలకు నిషేధాన్ని సడలించి ఎగుమతి చేస్తామని భారత్ పేర్కొంది. గోధుమల కన్సైన్మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్సైన్మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు గత వారం కేంద్రం ప్రకటించింది. ఈజిప్టునకు వెళ్ళే గోధుమల కన్సైన్మెంట్కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్సైన్మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్సైన్మెంట్కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు. ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఆ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయవచ్చునని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. అదే విధంగా రద్దు చేయడానికి వీలు కానటువంటి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈ నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకు ముందు జారీ చేసినట్లయితే, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించి, ఎగుమతి చేయవచ్చునని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.