అత్యాధునిక టెక్నాలజీతో సౌకర్యవంతంగా నిర్మించిన ఎక్స్ప్రెస్వేలో కీలకమైన ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటన చైనాలోని హుబే ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. కరోనా పుట్టిల్లు వూహాన్ కొలుకున్న హుబే ప్రావిన్స్ లోనే మరో ప్రధాన నగరం ఉజోలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. సిటీ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ ప్రెస్ హైవేలో కొంత భాగం కూలిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూలిన సమయంలో దానిపై మూడు ట్రక్కులు ప్రయాణిస్తున్నాయి. ఆ మూడు బ్రిడ్జితోపాటే కిందున్న రోడ్డుపై పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో కింది రోడ్డులో ప్రయాణిస్తోన్న కారు నుజ్జుయిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించారు. చైనాలో ఎక్స్ ప్రెస్ వే నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడం, కమ్యూనిస్ట్ పార్టీకి, అధికారులకు భారీ ఎత్తున లంచాలు ముడుతుండటం వల్ల పనులు నాసిరకంగా జరిగాయనే ఆరోపపణల నడుమ తాజా ప్రమాదం సదరు చర్చకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే, ప్రతిష్టాత్మక ఎక్స్ ప్రెస్ హైవేలో ఫ్లైఓవర్ కూలిన ఘటనపై విచారణ జరుగనుందని స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉంటే,
చైనాలో ప్రమాదాల సంగతి అలా ఉంటే, ప్రపంచ రాజకీయాల్లో చైనా ప్రాధాన్యం మరింత పెరిగిందనే సోదాహరణ తాజాగా చోటుచేసుకుంది. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా సన్నద్ధం అవుతుండగా, రష్యాను నిలువరించేలా అమెరికా, యూరోపియన్ దేశాలు ఒకతాటిపైకి వస్తున్నాయి. ఉక్రెయిన్పై దాడికి దిగితే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తప్పవని ఈయూ హెచ్చరిస్తున్నది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు కోసం చైనా వైపు చూస్తున్నారు. కొన్ని రోజుల కిందటే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ వర్చువల్ భేటీ నిర్వహించుకున్నారు. ప్రయోజనాలకు కాపాడుకునే విషయంలో రెండు దేశాలు గతంలోనూ సహకరించుకున్నాయని, రాబోయే రోజుల్లోనూ అదే విధానానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాధినేతలు ఉద్ఘాటించారు. రష్యాకు చైనా మద్దతుతో ఉక్రెయిన్ విషయంలో రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.