news18-telugu
Updated: November 10, 2019, 7:45 PM IST
ఆస్పత్రిలో వాంగ్.. ఇన్సెట్లో నత్తగుల్ల డిష్,టేప్ వార్మ్
కొన్నాళ్లుగా ఓ పేషెంట్ను వేధిస్తున్న అంతుచిక్కని వ్యాధిని చైనీస్ డాక్టర్లు ఎట్టకేలకు కనిపెట్టారు.అతనిని వేధిస్తున్నది వ్యాధి కాదని 'టేప్ వార్మ్' అనే పురుగు 15 ఏళ్లుగా అతని మెదడును తొలిచేస్తోందని గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా ఎట్టకేలకు మెదడు నుంచి ఐదు అంగుళాల టేప్ వార్మ్ని తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్కి చెందిన వాంగ్(36) అనే వ్యక్తికి నత్తగుల్లల మాంసం అంటే చాలా ఇష్టం. అలా 2004 నుంచి రాత్రిపూట డిన్నర్లో అతను నత్తగుల్లల ఫ్రై తింటున్నాడు. నత్తగుల్లలు తినడం ప్రారంభించిన ఏడాది వరకు అతను బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెల్లిగా క్షీణించడం మొదలైంది.మొదట అతని చేతులు,కాళ్లు బలహీనమవడం మొదలైంది. ఆ తర్వాత తరుచూ వాంతులు చేసుకోవడం, మరింత బలహీనపడటం జరిగింది. ఈ పరిస్థితుల్లో అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు.
ఇదే క్రమంలో అతను చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఒక్కో చోట ఒక్కోలా చెప్పారు.ఓచోట వైరల్ ఫీవర్ అని,మరోచోట ట్యూమర్ అని, ఇంకోచోట అయితే ఏకంగా క్యాన్సర్ సోకిందని చెప్పారు. అయితే ఏ డాక్టర్ కూడా తన అనారోగ్యానికి కచ్చితమైన కారణమేంటన్నది చెప్పలేకపోయాడు. అయితే ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరగా.. ఎట్టకేలకు అక్కడి వైద్యులు అతనికి వచ్చిన సమస్యేంటో కనిపెట్టారు. వైద్య పరీక్షలు నిర్వహించి అతని మెదడులో 'టేప్ వార్మ్' ఉన్నట్టుగా గుర్తించారు.
15 ఏళ్లుగా అది అతని మెదడును తొలచివేస్తున్నట్టుగా గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా 12 సెం.మీ టేప్ వార్మ్ను తొలగించారు. నత్తగుల్లలు తినే అలవాటున్న వాంగ్.. ఏదైనా సందర్భంలో సరిగా వండని నత్తగుల్లను తిని ఉంటాడని.. ఆ కారణంగా అతని శరీరంలోకి టేప్ వార్మ్స్ ప్రవేశించాయని వైద్యులు చెప్పారు.అది అక్కడినుంచి మెదడులోకి వెళ్లడంతో ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఎట్టకేలకు టేప్ వార్మ్ను తొలగించడంతో 15ఏళ్లుగా తనకేదో అయిందని సతమతమవుతున్న వాంగ్కి కాస్త ఉపశమనం లభించింది. వాంగ్కి సంబంధించిన ఈ కథనం చైనాలో వైరల్గా మారింది.
Published by:
Srinivas Mittapalli
First published:
November 10, 2019, 7:39 PM IST