Korean hackers stoling cryptocurrency : కొత్త ఏడాది ప్రారంభం నుంచే వరుస క్షిపణుల పరీక్షల (missile testing)తో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది ఉత్తర కొరియా (North Korea).ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది. ఇటీవల అత్యంత శక్తిమంతమైన మిసైల్ ను కూడ నార్త్ కొరియా ప్రయోగించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత గత వారం ఆ దేశం తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అమెరికాకు చెందిన గ్వామ్ దీవిని కూడా చేరుకోగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించడం గమనార్హం. అయితే , మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని సమాచారం. క్రిప్టో కరెన్సీ కోసం ఉత్తర కొరియా సైబర్ దాడులకు(North Korea Cyber Attacks) పాల్పడి.. ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఆయుధాలు మరియు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం.. ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్న విషయం తెలిసిందే.
కిమ్ ఆదేశాల మేరకు ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. అత్యంత హై సెక్యూరిటీ ప్యూచర్స్ ఉండే...బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరబడి దోచేస్తున్నారు. ఇలాగనే తాజాగా 620 మిలియన్ డాలర్లు(రూ. 4,500)విలువైన క్రిప్టో కరెన్సీని సింగిల్ హ్యాక్ లో కొట్టేసినట్లు తెలిసింది.. ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ(FBI)తాజాగా వెల్లడించింది. గత నెల 23వ తేదీన క్రిప్టో కరెన్సీలను సంపాదించడానికి ఆడే యాక్సిస్ ఇన్ఫినిటీ అనే ఓ వీడియోగేమ్ నెట్వర్క్ను వాడుకొని ఉత్తరకొరియాకు చెందిన హ్యాకింగ్ బృందాలైన లాజరస్, ఏపీటీ38లు.. 620 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని అపహరించాయి. ఈవిషయాన్ని మార్చి 29న అధికారికంగా ప్రకటించారు. యాక్సిస్ ఇన్ఫినిటీ అనే గేమ్ ను స్కైమావిస్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ వీడియోగేమ్ లో వినియోగదారులు క్రిప్టోలను ఒకరి నుంచి మరొకరికి పంపే నెట్ వర్క్ను వాడుకొని హ్యాకర్లు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఉత్తర కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టింది. దీంతో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం లాజరస్ గ్రూప్పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్పై కూడా ఆంక్షలు ప్రకటించింది.
ALSO READ News18 Exclusive : అధునాతన డ్రోన్స్ తో యాంటీ నక్సల్ ఆపరేషన్..భారీగా నక్సలైట్లు మృతి!
ఉత్తర కొరియా ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల లావాదేవీల నుంచి అపహరణలకు పాల్పడేలా యాపిల్ జ్యూస్ పేరిట ఓ మాల్వేర్ ను వినియోగిస్తోంది. 2018 నుంచి ఈ మాల్వేర్ లోని పలు వెర్షన్లను వినియోగించి 30 దేశాల్లో సైబర్ దాడులు చేసింది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఈ యాపిల్ జ్యూస్ హ్యాకర్లు 316 మిలియన్ డాలర్లను అపహరించారు. కిమ్ అధికారం చేపట్టినప్పటి నుంచి సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. 2021 నాటికి మొత్తం బ్యూరో-21గా పిలిచే సైబర్ వార్ఫేర్ గైడెన్స్ యూనిట్ లో 6,000 మంది ఉన్నారు.వీటిల్లోని బ్లూనోరోఫ్గా పిలిచే బృందంలో 1,700 మంది హ్యాకర్లు ఉన్నారు. వీరు ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్లు చేయడంతోపాటు ప్రత్యర్థుల నెట్వర్క్ బలహీతలను సుదీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆండీరీల్ అనే గ్రూపులో మరో 1600 మందికి ప్రత్యర్థుల కంప్యూటర్ నెట్ వర్కుల్లో బలహీనతలను గుర్తించడమే పని. ఈ విషయాలను 2020లో ఉ.కొరియా రక్షణరంగ సామర్థ్యాలపై అమెరికా సైన్యం తయారు చేసిన నివేదికలో వెల్లడించినట్లు బ్లూమ్బెర్గ్ కథనంలో పేర్కొంది. ఈ హ్యాకింగ్లకు పాల్పడిన వారికి కొంత మొత్తం రివార్డులు కూడా అక్కడి ప్రభుత్వం ఇస్తోందని సమాచారం.
కాగా, గత కొన్నేళ్లలోనే లాజరస్ గ్రూప్ ఒక్కటే 1.75 బిలియన్ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ "చైన్ ఎనాలసిస్" పేర్కొంది. జనవరిలో ఈ సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం ఉ.కొరియా హ్యాకర్లు గత ఏడాది 400 మిలియన్ డాలర్లు విలువైన డిజిటల్ ఆస్తులను దొంగలించారని పేర్కొంది. 2019లో రెండు బిలియన్ డాలర్ల ఆయుధాల తయారీకి ఈ సొమ్ము వెచ్చించారని, ఇది హ్యాకింగ్ ల ద్వారా సంపాదించిందేనని పేర్కొంది. ఆంక్షలు విధించినా ఉత్తర కొరియాకు మెటీరియల్, సాంకేతికత స్వేచ్ఛగా దొరకడానికి ఈ సొమ్మే కారణమని అమెరికా, ఐరాస నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cryptocurrency, Hacking, Kim jong un, North Korea