భారత్ బాటలో టిక్ టాక్ యాప్పై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఈ చైనీస్ యాప్పై వేటువేసింది. టిక్ టాక్ తర్వాత మరికొన్ని చైనీస్ దిగ్గజ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని శనివారం మీడియాకు తెలిపారు ట్రంప్. చైనాకు చెందిన అలీబాబా వంటి ఇతర కంపెనీలపైనా ఆంక్షలు పరిశీలిస్తారా? అని వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్ ప్రశ్నించగా.. అవును.. ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.
అమెరికాలో టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించి దాని మాతృసంస్థ బైట్ డాన్స్తో మైక్రో సాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా అమెరికన్ కంపెనీకి విక్రయించడమో చేసేందుకు బైట్ డాన్స్కు 90 రోజులు గడువిచ్చారు ట్రంప్. మొదట 45 రోజులే గడువు ఇవ్వగా.. తాజాగా మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే సంతకం చేశారు.
గత ఏడాది నుంచీ చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. పోటాపోటీగా దిగుమతి సంకాలను పెంచేస్తున్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ రావడంతో చైనాపై మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. చైనా వల్లే తమ దేశంలో లక్షలాది మంది కరోనా బారినపడి.. వేలాది మంది మరణిస్తున్నారని డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో చైనీస్ కంపెనీలపై నిషేధం విధిస్తున్నారు. టిక్ టాక్ తర్వాత అలీబాబా, వియ్ చాట్ వంటి దిగ్గజ సంస్థలపైనా ట్రంప్ నిషేధం విధించే అవకాశాలున్నాయని అమెరికా మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. గత వారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అలీబాబా పేరును నేరుగా ప్రస్తావించడంతో.. చైనీస్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్పై వేటుపడవచ్చని యోచిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, Tik tok, Tiktok