ఉక్రెయిన్ పై యుద్దం కారణంగా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు ఇంకా పిచ్చిపట్లు వ్యవహరిస్తోందా? దానికి డ్రాగన్ చైనా దన్నుగా నిలుస్తోందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ఆ రెండు దేశాలూ తాజాగా అనూహ్య చర్యకు పాల్పడ్డాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలు క్వాడ్ సదస్సులో పాల్గొన్న వేళ రష్యా-చైనా తమ యుద్ద విమానాలతో కలకలం సృష్టించాయి. వివరాలివే..
జపాన్ రాజధాని టోక్యోలో ‘క్వాడ్ 2022’ సదస్సు జరుగుతున్న వేళ చైనా, రష్యా దూకుడు చర్యకు పాల్పడ్డాయి. ఇరుదేశాలకు ఫైటర్జెట్లు ఉమ్మడిగా జపాన్ గగనతలానికి సమీపం నుంచి పయనించాయి. ఈ విషయాన్ని జపాన్ రక్షణశాఖ మంత్రి నొబువో కిషీ ప్రకటించారు. ప్రాంతీయ భద్రతలో భాగంగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు చర్చలు జరుపుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దుందుడుకు చర్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తం నాలుగు విమానాలు జపాన్ గగనతలానికి సమీపం నుంచి ప్రయాణించాయన్నారు. అయితే రష్యా, చైనా విమానాలు జపాన్ ప్రాదేశిక గగనతలంలోకి మాత్రం ప్రవేశించలేదని స్పష్టం చేశారు. అయితే గతేడాది ఏడాది నవంబర్ నుంచి చైనా, రష్యా విమానాలు ఒకేసారి జపాన్ సమీపంలోకి రావడం ఇది 4వసారి అని జపాన్ మంత్రి వివరించారు.
అయితే సాధారణ పెట్రోలింగ్లో భాగంగానే చైనీస్ హెచ్-6ర బాంబర్స్, రష్యన్ టు-95ఎంఎస్ బాంబర్స్ విమానాలు ఉమ్మడిగా జపాన్ సముద్రం, ఈస్ట్ చైనా సముద్రం, వెస్ట్ పసిఫిక్ సముద్రాలపైన మంగళవారం గస్తీ నిర్వహించాయని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటన విడుదల చేసింది. విమానాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే ప్రయాణించాయని, ఇతర దేశాల గగనతలంలోకి ప్రవేశించలేదని ట్విటర్లో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.