Joe Biden-Xi Jinping Video Call : ప్రపంచ శాంతి కోసం అమెరికా, చైనా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. బైడెన్, జిన్ పింగ్ సుమారు రెండు గంటల పాటు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ లోని పరిణామాలు ఎవరికీ ప్రయోజనం కలిగించవని పేర్కొన్నారు చైనా అధ్యక్షుడు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇరుదేశాల మధ్య సహకారం అవసరమని సూచించారు.
జిన్ పింగ్ మాట్లాడుతూ..." ప్రపంచ శాంతి, అభివృద్ధి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్రపంచం సామరస్యంగానూ, స్థిరంగానూ లేదు. మేము కోరుకుంటున్నది ఉక్రెయిన్ సంక్షోభం కాదు. దేశాలు రణరంగంలోకి రాకూడదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఘర్షణలను ఎవరూ కోరుకోరు. శాంతి, భద్రతల కోసమే అంతర్జాతీయ సమాజం ఎక్కవగా ఖర్చు చేయాలి. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యులుగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో పయనించేలా చూడాలి. అమెరికా- చైనా కేవలం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడమే కాక ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అంతర్జాతీయ బాధ్యతలను అమెరికా- చైనాలు భుజానికెత్తుకోవాలి"అని అన్నారు.
ALSO READ Sri Lanka Crisis : పేపర్ కొనడానికి డబ్బుల్లేక..శ్రీలంకలో స్కూల్ ఎగ్జామ్స్ రద్దు
ఉక్రెయిన్ పై రష్యా దాడులను చైనా ఖండించటం లేదని, రష్యాతో సత్సంబంధాల కారణంగానే చైనా మౌనంగా ఉండిపోతోందని అమెరికా విమర్శలు చేస్తున్న క్రమంలో బైడెన్ తో జిన్పింగ్ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. "చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మరింత మంది చనిపోకూడదు. సంక్షోభం తలెత్తకూడదు. యుద్ధం త్వరగా ముగిసిపోవాలి. ఇందుకోసం రష్యాతో అమెరికా, నాటో దేశాలు కూడా చర్చలు జరపాలి" అని బైడెన్ తో ఫోన్ కాల్ సందర్భంగా జిన్ పింగ్ అన్నారని చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) వెల్లడించింది. ఈ సందర్భంగా రష్యాకు సాయం చేయొద్దని జిన్ పింగ్ ను బైడెన్ కోరినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.