ఒమిక్రాన్ వేరియంట్ రాక తర్వాత కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ బుసలు కొడుతూ ప్రపంచ దేశాలను ముంచెత్తుతోంది. తొలి, రెండో వేవ్ మాదరిగానే ప్రస్తుత మూడో వేవ్ లోనూ అగ్రరాజ్యం అమెరికా అతిపెద్ద బాధితురాలిగా ఉంది. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా కేసులు సునామీలా వెల్లువెత్తాయి. ఒక్క రోజులోనే 13లక్షల కొత్త కేసులు నమోదవుతుండటం, ఆస్పత్రుల్లో చేరికలు పెరగడంతో దేశంలో ఆరోగ్య వస్థ దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది. కరోనా పేషెంట్ల కాంటాక్ట్ లోకి వెళ్లినా పర్వాలేదు.. మాస్క్ పెట్టేసుకొని డ్యూటీలకు వచ్చేయండంటూ నర్సులు, డాక్టర్లపై ఒత్తిడి పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిని ట్రాన్సిషన్ దశగా అభివర్ణించారు ప్రఖ్యాత సైంటిస్టులు.
కరోనా వైరస్ విషయంలో అమెరికాగానీ, ప్రపంచ దేశాలుగానీ చేయగలిగేది ఏమీ లేదని, కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం అసాధ్యమని అమెరికన్ టాప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. అమెరికా ఇప్పుడు కరోనాతో కలిసి జీవించే దశకు చేరుతోందనీ ఆయన సూత్రీకరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ టాప్ సైంటిస్టుగా ఉన్న ఫౌచీ కామెంట్లు సంచలనం రేపాయి. విచిత్రం కాకుంటే, భారత్ లో ప్రభుత్వ నిపుణులు సైతం కరోనాను అడ్డుకోలేమని క్లారిటీ ఇచ్చినరోజే అమెరికాలో ఫౌచీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు..
కరోనా వైరస్ ను అడ్డుకోవడం అసాధ్యమని, కొవిడ్ వ్యాధిని తట్టుకొని, దాంతో కలిసి జీవించే అమెరికా వెళ్తోందని ఆ దేశ టాప్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల్లో ప్రధానమైనది వేగంగా వ్యాప్తి చెందడమని, ఇప్పుడా లక్షణం కొవిడ్ బారినపడ్డ అందరిలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనావైరస్ సమూల నిర్మూలన అసాధ్యమని, వాళ్ల నుంచి వైరస్ కొత్త మ్యూటేషన్లు పుట్టుకురావడం ఖామమని, సమయానికి వ్యాక్సిన్లు తీసుకొన్నవారు.. వైరస్ కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాలను మాత్రమే తప్పించుకొంటారు కానీ, వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఫౌచీ.. ఈ క్రమంలో దేశం కొత్త దశలోకి అడుగు పెడుతుందని అంచనా వేశారు.
కొవిడ్ టీకాలతో కొంత రక్షణ పొందినవారు, ఆరోగ్య సమస్యలున్నవారు వైరస్ బారిన పడినా.. తేలిగ్గా చికిత్స చేయడానికి సరిపడా మందులు ఉన్న స్థితికి అమెరికా చేరుతుందని ఆశిస్తున్నట్లు ఫౌచీ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు మిలియన్కు పైగా కేసులు.. 1,50,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్సలు .. 1,200 మంది ప్రాణాలు కోల్పోతుండటంతో.. తాను అంచనా వేసిన స్థితికి అమెరికా ఇంకా చేరుకోలేదన్నారు. ప్రస్తుతానికి ట్రాన్షిషన్ ఆరంభదశలోనే ఉన్నామని, రాబోయే రోజుల్లో తన అంచనాలు నిజం కావొచ్చని ఫౌచీ అన్నారు.
కాగా, కరోనా వైరస్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మూలించడం, విస్తరణ ఆపడం సాధ్యం కాదన్న సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీపై రిపబ్లికన్ సెనెటర్ రాండ్పౌల్పై నిప్పులు చెరిగారు. ఫౌచీ తనలోని పిచ్చితనాన్ని బయటపెట్టుకుంటున్నాడని, అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిత్యం వందల సంఖ్యలో అమెరికన్లు మృతి చెందడానికి కూడా ఫౌచీనే కారణమని పౌల్ ఆరోపించారు. కాగా రిపబ్లికన్ సెనేటర్ పౌల్వి పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలని ఫౌచీ తోసిపుచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.