War crimes trial against Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను యుద్ధ నేరస్థుడని బైడెన్ మరోసారి ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్న పుతిన్ పై.. యుద్ధ నేరాల విచారణ జరపాలని జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ లోని బుచ పట్టణంలో పౌరులపై జరిగిన హత్యాకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వైట్హౌస్ లో మీడియాతో మాట్లాడిన బైడెన్.. బుచాలో ఏమి జరిగిందో మీరు చూశారు..పుతిన్ ఓ యుద్ధ నేరస్థుడు అని అన్నారు. పుతిన్ యుద్ధ నేరుస్థుడని అన్నందుకు గతంలో తనపై విమర్శలు చేశారని, కానీ ఈ దారుణాలు చూస్తే అతను నిజంగా యుద్ధ నేరస్థుడే అని అర్థమవుతోందని చెప్పారు.
బెడైన్ మాట్లాడుతూ.."ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బుచా పట్టణంలో సామూహికంగా సమాధి చేసిన మృతదేహాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. మేం సమాచారం సేకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. వాస్తవంగా పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ జరుపాలి. పుతిన్ క్రూరుడు. రష్యాపై యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఉక్రెయిన్కు మేం అందజేస్తూనే ఉంటాం. బుచ పట్టణంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు" అని అన్నారు. పుతిన్ పై తప్పని సరిగా యుద్ధ నేరాల విచారణ జరపాలని బైడెన్ డిమాండ్ చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు బైడెన్ అన్నారు.
ALSO READ New WHO Data : ప్రపంచంలో స్వచ్ఛమైన గాలి పీల్చుతోంది ఎందరో తెలుసా
బుచా ఘటనపై ఉక్రేనియన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా మాట్లాడుతూ.. రష్యా దళాలు వెనక్కి తగ్గిన తర్వాత కైవ్ ప్రాంతంలో 410 పౌరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మరోవైపు, బుచా పట్టణంతోపాటు ఉక్రెయిన్లో పౌరులను హత్య చేశామన్న ఆరోపణలను రష్యా నిరాకరిస్తున్నది. ఆరోపణలన్ని అవాస్తమని, వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇక,సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. బుచాను సందర్శించారు. రష్యా మారణహోమాన్ని సృష్టిస్తుందని.. వెంటనే కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలకు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.
మరోవైపు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి రష్యాను సస్పెండ్ చేయాలని కోరుతామని యుఎస్ తెలిపింది. రష్యాపై కఠినమైన ఆంక్షలపై అత్యవసర చర్చలు జరుగుతున్నాయని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ చెప్పారు. ఇదిలావుండగా, రష్యా దాడి నేపథ్యంలో దాదాపు 4.2 మిలియన్లకు పైగా ఉక్రెయిన్ శరణార్థులు దేశం విడిచిపెట్టారని, మానవతా పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.