షహీద్ భగత్ సింగ్ ఆయన మిత్రులు రాజ్ గురు, సుఖ్ దేవ్లు దేశం కోసం చేసిన బలిదానానికి 88 సంవత్సరాలు గడిచింది. 1928లో బ్రిటిష్ ఏఎస్స్పీ జాన్ సాండర్స్ హత్య కేసులో నాటి లాహోర్ హై కోర్టు భగత్ సింగ్ అతని మిత్రులకు ఉరిశిక్ష విధించగా, 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో శిక్షను అమలు చేశారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా బలిదాన్ దివస్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే భగత్ సింగ్ స్వస్థలం పాకిస్థాన్ లో కూడా ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ అక్కడ ఆయన అభిమానులు ప్రతీ ఏట స్మఈతి దినం జరుపుకుంటారు. అయితే భగత్ సింగ్ అతని అనుయాయులకు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ పాకిస్థాన్ కు చెందిన ఇంతియాజ్ రషీద్ కురేషీ మాత్రం లాహోర్ హై కోర్టులో జాన్ సాండర్స్ హత్య కేసు రీ ఓపెన్ చేయాల్సిందిగా, అప్పీలు చేశారు.
1928లో అంటే సరిగ్గా 91 సంవత్సరాల క్రితం జరిగిన ఈ హత్యోదంతం కేసులో భగత్ అతని అనుయాయులకు ఉరిశిక్ష పడింది. అయితే భగత్ సింగ్ అతని అనుచరులను శిక్ష అమలు జరగడానికి విధించిన నిర్ణీత సమయం కన్నా 11 గంటల మునుపే అమలు చేసినట్లు ఇంతియాజ్ రషీద్ వాదన లేవదీస్తున్నారు.
అలాగే సాండర్స్ హత్య కేసులో 1928 డిసెంబర్ లో లాహోర్ లోని అనర్కలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో అసలు భగత్సింగ్ పేరు లేదని ఇంతియాజ్ వాదిస్తున్నారు. నిజానికి 2013లోనే బ్రిటన్ ప్రధాన మంత్రి, అలాగే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్లకు భగత్ సింగత్ అతని అనుచరుల ఉరిపై భారత్, పాకిస్థాన్ ప్రజలకు క్షమాపణ కోరుతూ అప్పీలు చేసినట్లు ఇంతియాజ్ తెలిపారు. గతంలో జలియన్ వాలా బాగ్ మారణ హోమంపై నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పొరపాటు చేసినట్లు ఒప్పుకొని చింతించారు. మరి ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరిసామేపై భగత్ సింగ్ ఉరిశిక్ష అమలుపై క్షమాపణ తెలపాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
ఇదిలాఉంటే బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్య కేసును రీఓపెన్ చేయాలని పెట్టిన పిటీషన్లో 1928 నాటి ఎఫ్ఐఆర్ యే కీలకంగా మారనుంది. హత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఉర్దూలో ఉంది. అందులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జాన్ సాండర్స్ పై కాల్పులు జరిపి పారిపోయినట్లు హెడ్ కానిస్టేబుల్ చనన్ సింగ్ నమోదు చేశారు. అలాగే హంతకులు సుమారు 5.5 అడుగుల ఎత్తు, చిన్న మీసం, బక్క బలచటి శరీరం, పైజామా, కుర్తా ధరించినట్లు ఎఫ్ఐఆర్ లో రిపోర్టు చేశారు.
కాగా ప్రస్తుతం ఇంతియాజ్ అనర్కలీ పోలీస్ కేసులో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా లాహోర్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి కేసులో కీలకమైన ఎఫ్ఐఆర్ కాపీని సీల్డ్ కవరులో కోర్టుకు అందజేయాలని కోరారు. అయితే సాండర్స్ ను భగత్ సింగ్ హత్య చేశారా లేదా అనేది వాదన ఉద్దేశ్యం కాదని ఏ కేసులో అయినా సరైన సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష అమలు చేస్తే అది న్యాయసూత్రాలకు విరుద్ధమని ఇంతియాజ్ వాదిస్తున్నారు. అలాగే సాండర్స్ హత్య కేసులో మొత్ంత 300 మందిని సాక్షులుగా నాటి బ్రిటిష్ గవర్నమెంటు పేర్కొనగా, వారిలో ఎవరినీ ప్రశ్నించలేదని, అలాగే కేసులో కీలకమైన ఎఫ్ఐఆర్ లో భగత్ సింగ్ పేరు లేదని ఇంతియాజ్ వాదిస్తున్నారు. మరి ఈ కేసుపై లాహోర్ హై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, India, Pakistan