అఫ్గానిస్తాన్ను(Afghanistan) తాలిబన్లు ఆధీనంలోకి తీసుకన్న తర్వాత వేలాది మంది ఆ దేశ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది దేశం వీడగా.. చాలా మంది ఎలాగైనా సరే అఫ్గాన్ వీడి వెళ్లాలని కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Hamid Karzai International Airport) చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే విమానాశ్రయం లోపల, వెలుపల వేలాది మంది దేశం విడిచి వెళ్లేందుకు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. అయితే కాబూల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, జనాలు ఏ విధమైన కష్టాలు పడుతున్నారో చెప్పే ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చాలా మంది అఫ్గాన్ను వీడి వెళ్లేందుకు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. అయితే అలాంటి వారికి అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు చుక్కుల చూపిస్తున్నాయి. ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్లుగా(దాదాపు రూ. 3వేలు) ఉండటం సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. అయితే అమ్మకాలు.. డాలర్లలో సాగడంతో వాటర్ బాటిల్ కొని దాహం తీర్చుకోలేని స్థితిలో కాబూల్ ఎయిర్పోర్ట్లో చాలా మంది జనాలు కష్టాలు అనుభవిస్తున్నారు.
‘కాబూల్ ఎయిర్పోర్ట్లో(Kabul Airport) వాటర్ బాటిల్ 40 డాలర్లు, ప్లేట్ మిల్స్ 100 డాలర్లకు అమ్ముతున్నారు. అంతా డాలర్లలో సాగుతుంది. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు’అని ఓ అఫ్గాన్ పౌరుడు ఒకరు ఆగస్టు 25న రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాడు. అంతేకాకుండా కాబూల్ ఎయిర్పోర్ట్ బయట కూడా పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. కాబూల్ ఎయిర్పోర్టు కాంపౌడ్ వాల్ బయట ఉన్న అఫ్గాన్లు.. లోనికి ప్రవేశించేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. కాంపౌడ్ వాల్ బయట.. కొందరు అఫ్గాన్లు మురికి కాలువలో సైతం వేచి ఉన్నారు. అందులో తిరుగుతూ ఎయిర్పోర్ట్లోకి ఎలాగైన్ ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధిచిన ఓ వీడియోను అఫ్గాన్ జర్నలిస్ట్ హిజ్బుల్లా ఖాన్( Hizbullah Khan) ట్విట్టర్లో షేర్ చేశారు.
Another day, another tragedy & shocking scene at #Kabul Airport #AfghanistanCrisis #Afghanistan pic.twitter.com/7o7HPgvl2u
— Hizbullah Khan (@HizbkKhan) August 26, 2021
మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణ గడువు(ఆగస్టు 31) సమీపిస్తుండటంతో పలు దేశాలు తమ పౌరుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. అమెరికా కూడా తమకు సహకరించిన అఫ్గాన్ వాసులను కూడా తరలింపు చేపడుతుంది. ఇప్పటికైతే కాబూల్ ఎయిర్పోర్ట్ మాత్రం అమెరికా బలగాల పర్యవేక్షణలో ఉంది. అయితే ఎయిర్పోర్ట్ బయట మాత్రం తాలిబన్ల(Talibans) ఆధీనంలోకి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు ఎయిర్పోర్ట్కు వచ్చే మార్గాలలో తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఇలా తనిఖీలు చేపడుతున్న తాలిబన్లు.. అఫ్గాన్ పౌరులు ఎయిర్పోర్ట్కు చేరకుండా అడ్డుకుంటున్నట్టుగా సమాచారం. దీంతో చాలా మందిలో ఆందోళ నెలకొంది. ‘విమానాశ్రయంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా మంది జనాలు ఇక్కడ ఉన్నారు. ప్రజలు, మహిళలు మరియు పిల్లలు రద్దీ కారణంగా భయానక స్థితిలో ఉన్నారు’అని ఎయిర్పోర్ట్ గేట్ల వద్ద వేచి ఉన్న ఓ వ్యక్తి రాయిటర్ వార్తా సంస్థకు తెలిపాడు.
అయితే కాబూల్ ఎయిర్పోర్ట్పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(Islamic State militants) దాడి చేసే అవకాశం ఉందని అమెరికా, బ్రిటన్లు పౌరులను హెచ్చరించాయి. అక్కడ ఉండటం అంతా సురక్షితం కాదని.. రక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాయి. అయితే అఫ్గాన్ పౌరులు మాత్రం ఎలాగైనా సరే దేశం విడిచి వెళ్లాలని ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే పడిగాపులు గాస్తున్నారు.
ఇక, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపునకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) మీడియాకు చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు 1500 మంది అమెరికన్లు అఫ్గాన్లో ఉన్నట్టుగా.. వారు ఎయిర్పోర్ట్కు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నామని ఒక పాశ్చాత్య దౌత్యవేత్త రాయిటర్స్తో అన్నారు.
మరోవైపు ఇప్పటికి తరలింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడం.. ఉపసంహరణ గడువు దగ్గరపడుతుండటంతో.. పలు దేశాలు గడువును పొడగించేలా చర్యలు తీసుకోవాలని అమెరికాను(America) కోరుతున్నాయి. అయితే తాలిబన్ నేతలు మాత్రం అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 డ్లైన్ తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉపేక్షించబోమని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Taliban