కన్న తల్లి బిడ్డలపై చూపించే ఆప్యాయత ఏ దేశంలోనైనా ఒకేలా ఉంటుంది. చైనా అయినా, సింగపూర్ అయినా, ఇండియా అయినా అమ్మ ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మారదు. కన్నతల్లి గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుడు.. అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. అలాంటి అమ్మ అసువులు బాసి మరీ బిడ్డను కాపాడిన ఘటన చైనాలో వెలుగుచూసింది. చైనాలో మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో 33 మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో.. హెనాన్ ప్రావిన్స్లోని వాంగ్జాంగ్డియన్లో బుధవారం నాడు వర్షాల కారణంగా ఇల్లు కూలడంతో.. ఆ కూలిన శిధిలాల కింద ప్రమాదవశాత్తూ ఓ తల్లీబిడ్డ చిక్కుకున్నారు. ఆ శిధిలాల కింద వరద నీరు ఉప్పెనలా ప్రవహిస్తోంది.
రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు. తాను చనిపోయినా పర్లేదని, బిడ్డను కాపాడాలని ఆ తల్లి పడిన ఆరాటం.. ఆ వానలో.. వరదల్లో బిడ్డ ప్రాణం పోకుండా చేసిన పోరాటం అంతాఇంతా కాదు. దాదాపు 24 గంటలు బిడ్డను వరద నీరు ముంచెత్తకుండా చేతులతో అలానే పట్టుకుంది. ఆమె మాత్రం నీటిలో మునిగిపోయి.. ఇబ్బంది పడుతూనే ఉంది. బిడ్డను తీసుకుని బయట పడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వృధానే అయ్యాయి.
ఆ ప్రాంతమంతా వరద నీరు పోటెత్తుతుండటంతో ఉదయం కూడా ఆ తల్లీబిడ్డను ఎవరూ గమనించలేదు. చివరకు రెస్క్యూ సిబ్బంది గమనించి ఆ తల్లీబిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ బిడ్డనైతే కాపాడగలిగారు గానీ తల్లి మాత్రం ఆ బిడ్డను చేతులతో ఎత్తి పట్టుకుని అలానే ఉండి.. వరద నీటిలో ఊపిరాడక చనిపోయింది. ఆ బిడ్డ వయసు మూడు లేదా నాలుగు నెలలు ఉండొచ్చని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. ఆ బిడ్డను సహాయక సిబ్బంది కాపాడిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆ తల్లిని తలచుకుని నెటిజన్లు మాతృ ప్రేమను మరొక్కసారి గుర్తుచేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Mother, Viral Video