అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. అట్లాంటా ప్రాంతంలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మసాజ్ పార్లర్లే టార్గెట్గా కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం మూడు చోట్ల కాల్పులు జరిగాయి. దుండగుడి దాడిలో మొత్తం 8 మంది మరణించారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. అందులోనూ ఆరుగురు ఆసియన్లు ఉన్నట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే ఎందుకు కాల్పులు జరిపాడన్న వివరాలు మాత్రం తెలియ రాలేదు.
మంగళవారం సాయంత్రం అట్లాంటాలోని అక్వర్త్ ప్రాంతంలో ఉన్న యంగ్స్ ఏషియన్ మసాజ్ వద్ద మొదట కాల్పులు జరిగాయి. పోలీసులు దోపిడీగా భావించారు. కానీ ఆ దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించాడు. అక్కడ నలుగురు మరణించారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘటన జరిగిందని వెల్లడించారు. సాయంత్రం 5.47గంటల ప్రాంతంలో గోల్డ్ స్పా వద్ద జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు మహిళలు మరణించారు. పోలీసులు అక్కడ ఉండగానే.. అరోమాథెరపీ స్పా వద్ద మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మరో మహిళ మృతి చెందింది.
కాల్పులకు తెగబడిన దుండగుడుని వుడ్స్టాక్కు చెందిన రాబర్డ్ ఆరోన్లాంగ్గా గుర్తించారు. అతడి వయసు 21 ఏళ్లు. రాత్రి 8.30గంటల ప్రాంతంలో జార్జియాలోని క్రిస్ప్ కౌంటీలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు మసాజ్ పార్లర్లలో ఇతడొక్కడే కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఐతే కాల్పుల వెనక ఉద్దేశం తెలియదని.. కఆసియన్ మహిళలను టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపినట్లు చెప్పడం కష్టమని తెలిపారు. ఈ మూడు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చేశాడు? దీని వెనక ఎవరున్నారు? అని ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Us news, Us shooting