భారత ఆర్మీ సమరానికి ఎప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇటీవల యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ తమ దేశ సైన్యాన్ని ఆదేశించిన వేళ భారత హోంమంత్రి ఈ కామెంట్స్ చేయడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత నాలుగు నెలల కాలంలో అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. ‘భారతదేశం ఒక్క అంగుళం భూమి కూడా చైనాకు దక్కనివ్వదు.’ అని అమిత్ షా స్పష్టం చేశారు. ‘ప్రతి దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. (యుద్ధానికి) అందుకే ఆర్మీ ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఎదుర్కొంనేందుకే ఆర్మీని ప్రభుత్వం మెయింటెయిన్ చేస్తుంది. నేను ఎవరి కామెంట్స్ను ఉద్దేశించి ఈ మాట అనడం లేదు. కానీ, భారత రక్షణ బలగాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి.’ అని అమిత్ షా స్పష్టం చేశారు. అమిత్ షా మరో విషయాన్ని కూడా చెప్పారు. రెండు దేశాలు పరస్పరం చర్చించుకుంటున్నాయని, దౌత్య పరమైన చర్చలు ఇంకా తెరుచుకునే ఉన్నాయన్నారు. ‘హోంమంత్రిగా నేను ఈ మాటలు చెప్పకూడదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలనే నేనూ చెబుతున్నాం.. మేం సిద్ధంగా ఉన్నాం. ఎవ్వరూ కూడా సరిహద్దుల నుంచి ఒక్క అంగుళం భూమి కూడా లాక్కోలేరు.’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
భారత్, చైనా మధ్య బోర్డర్ టెన్షన్కు సంబంధించి రెండు దేశాల దౌత్యాధికారులు, మిలటరీ అధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. అక్టోబర్ 13న ఏడో రౌండ్ సమావేశాలు జరిగాయి. అయితే, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ను సందర్శించినపుడు చేసిన కామెంట్స్ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. చైనీస్ సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన జిన్ పింగ్ ‘మీ మనసును, శక్తిని యుద్ధానికి సన్నద్ధం చేయండి.’ అని వ్యాఖ్యానించారు.
Home Minister @AmitShah speaks to me in his first extensive interview in over 4 months. Watch the full #AmitShahToNews18 interview tonight at 9:00 PM on @CNNNews18, @News18India, @News18Bihar, and across the @Network18Group. pic.twitter.com/F5dAG8IYLA
— Rahul Joshi (@18RahulJoshi) October 17, 2020
అరుణాచల్ ప్రదేశ్, లద్దాక్ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిని దీటుగా ఎదుర్కొనేందుకు టిబెట్, తైవాన్ విషయంలో భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే అంశంపై ప్రశ్నించగా, అమిత్ షా స్పందించారు. ‘ఈ అంశంపై ఇక్కడ చర్చించడం సరికాదు. అది చాలా సంక్లిష్టమైన ఇష్యూ. దాని పర్యవసానాలు కూడా చాలా దూరం ఉంటాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే చైనా విషయంలో, భారత ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. నాకు తెలిసి అది సరిపోతుంది. చైనాతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.’ అని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా అమిత్ షా స్పష్టం చేశారు. భారత్కు ప్రపంచ దేశాలకు మద్దతుగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘మన ఉద్దేశాలు ఉన్నతమైనవి. బలమైనవి. 130 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశం ఎవరికీ తలవంచదు. మనం సరిగానే ఉన్నాం. మనకు చాలా దేశాలు మద్దతిస్తున్నాయి.’ అని అమిత్ షా చెప్పారు.
ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ చైనా ‘చెడు ప్రవర్తన’ను దుయ్యబట్టారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ సరిహద్దుల్లో చైనా 60వేల మంది బలగాలను మోహరించిందని, ఈ సమయంలో భారత్కు అమెరికా మద్దతు అవసరం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.